
ధర ఢమాల్... రైతు డీలా..
బల్లికురవ: వాణిజ్య, వ్యాపార పంటలు సాగుచేసి విసిగి వేసారిన రైతులు దశాబ్దం నుంచి పండ్ల తోటల సాగు వైపు మళ్లారు. సాగులో ఉద్యానశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది ధర దిగజారటంతో తోటల వద్దకు కొనేవారు కరువయ్యారు. దీంతో కాయలు పండి రాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1011 ఎకరాల్లో సాగు
బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు మండలాల్లో 1011 ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి సాగు చేపట్టారు. ఖరీఫ్ ఆరంభంలో సారవంతమైన నీటి వసతి కలిగిన భూముల ఎంపికతో బల్లికురవ మండలంలోని వేమవరం, ఉప్పుమాగులూరు, కూకట్లపల్లి, వల్లాపల్లి, కొత్తూరు, రామాంజనేయపురం, వెలమవారిపాలెం, కొప్పర పాలెం, సంతమాగులూరు మండలంలోని చవిటిపాలెం, ఏల్చూరు, కుందుర్రు, కొప్పరం, మక్కెనవారిపాలెం, పాతమాగులూరు, మార్టూరు మండలంలోని జంగమహేశ్వరపురం, బొల్లాపల్లి, ఇసుకదర్శి, నాగరాజుపల్లి, తండాలో పండ్ల తోటల సాగు చేపట్టారు. ఫిబ్రవరి, ఏప్రిల్ వరకు ధరలు కొంత మేర ఆశాజనకంగానే ఉన్నాయి. బొప్పాయి కిలో రూ.15 నుంచి రూ.18 పలకగా మామిడి కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలికింది.
అకాల వర్షాలతో దిగజారిన ధరలు
మే నెలలో కురిసిన అకాల వర్షాలకు తోడు ఎగుమతులు లేనందున గత నెల నుంచి బొప్పాయి కిలో రూ.3లకు, మామిడి కిలో రూ.30లకు పడిపోయింది. తీరా దిగుబడులతో ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికందే దశలో మార్కెట్ దిగజారటం, ఎగుమతులు లేనందున రైతులు చేసేది లేక తోటల వద్ద వచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దిగజారిన ధరలతో పంటల సాగుకు తెచ్చిన పెట్టుబడులు ఎలా తీర్చాలో అంతుచిక్కటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా మార్కెటింగ్ చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
1011 ఎకరాల్లో పండ్ల తోటల సాగు కొనే నాథుడు లేక తోటల్లోనే పండి రాలిపోతున్న కాయలు ఎకరాకు రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు ప్రభుత్వ ప్రోత్సాహం నిల్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని రైతుల వేడుకోలు రైతులను నట్టేట ముంచిన అకాల వర్షాలు

ధర ఢమాల్... రైతు డీలా..

ధర ఢమాల్... రైతు డీలా..