
ఎగవేతదారుల నుంచి పన్నులు వసూలు చేయాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: వాణిజ్య పన్నుల ఎగవేతదారుల నుంచి పన్ను వసూలుకు అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వాణిజ్య పన్నులు, అనుబంధశాఖల అధికారులతో జిల్లాస్థాయి సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. చట్టబద్ధంగా వాణిజ్య పన్ను వసూలుపై యంత్రాంగం దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.95.14 కోట్లు వాణిజ్య పన్ను వసూలు జరిగిందన్నారు. ప్రస్తుతం గణనీయంగా పన్ను వసూలు తగ్గడంపై ఆరా తీశారు. గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు, రవాణాలో బోగస్ రిజిస్ట్రేషన్ల ద్వారా పన్నులు వసూలు కావడం లేదని తాజా సర్వేలో వెలుగులోకి వచ్చిందన్నారు. పన్నుల ఎగవేతను అరికట్టడానికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తీర ప్రాంతాల్లోని రిసార్డ్స్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై పర్యాటకశాఖ, వాణిజ్య పనుల శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. జీఎస్టీ చెల్లించకుండా గుత్తేదారులు పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయితే వారిని బ్లాక్లిస్టులో పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో వాణిజ్య పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి గీతామాధురి, డీఆర్వో జి గంగాధర్ గౌడ్, జిల్లా వాణిజ్య పనుల శాఖ అధికారిని ఆర్ శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీఎంఎఫ్ఎంఈ పథకంతో ఉపయోగం
వేటపాలెం: పీఎం సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి (పీఎంఎఫ్ఈ) పథకాన్ని అందిపుచ్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలోని సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి లబ్ధిదారుల యూనిట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ప్రసాద్నగర్లోని సాయి తేజ వేరుశనగ శుద్ధి యూనిట్ను పరిశీలించారు. లాభనష్టాలను, వ్యాపారసరళి, ముడి సరుకు కొనుగోలు వివరాల ను యజమానిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి కొత్తపేట బాల ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. విద్యుత్ సమస్యల వలన ఉత్పత్తి జరగటం లేదని తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఖలీం, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ గోపికృష్ణ పాల్గొన్నారు.