
కొనుగోళ్లు ఉన్నట్టా.. లేనట్టా!
పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. జిల్లాలో రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ వెనకడుగు వేస్తోంది. పర్చూరులో ఈ నెలలో అధికారిక కొనుగోళ్లు ప్రారంభిస్తామన్న కూటమి ప్రభుత్వం వాగ్దానం ఇంకా నెరవేరలేదు. బర్లీ పొగాకు రైతులను మభ్య పెట్టేందుకు జూన్ 7వ తేదీన మంచి రోజు అంటూ హడావుడిగా మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీతో కొబ్బరి కాయ కొట్టించి పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరో 15 రోజుల్లో కొనుగోలు కేంద్రం ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు జరుపుతామన్నారు. అటు తరువాత స్థానిక శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడును కలిసి ఈనెల 17వ తేదీ పర్చూరు మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రం ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కానీ మంగళవారం పర్చూరులో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు.
పగబట్టిన పొగాకు
నాలుగేళ్లుగా లాభాలు రావడంతో ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు పొగాకు సాగు చేపట్టారు. దీంతో కౌలు, కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ రైతులకు ఆశ చావక పొగాకు పంటను విస్తృతంగా చేపట్టారు. ఈ క్రమంలో గిట్టుబాటు ధర మృగ్యమైంది. దీంతో వైఎస్సార్ సీపీ, రైతు సంఘం నాయకులు పొగాకు రైతుల తరఫున ఆందోళన బాట పట్టారు. ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు. మే 24న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కూడిన బృందం పర్చూరు ప్రాంతంలో పర్యటించి రాష్ట్రంలోని 22 ప్రయివేట్ కంపెనీలు బర్లీ పొగాకును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ కంపెనీలు 25 మెట్రిక్ టన్నులకు మించి కొనుగోలు చేయలేకపోయాయి. వ్యవసాయ శాఖ అందించిన లెక్కల ప్రకారం గత వారం నాటికి రైతుల వద్ద ఉన్న మొత్తం 87 మెట్రిక్ టన్నులకుగాను కేవలం 25 మెట్రిక్ టన్నులు కంపెనీలు కొనుగోలు చేశాయి. రైతు సంఘాలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో మార్క్ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఏడు మార్కెట్ యార్డుల ద్వారా..
రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పంట నిల్వలకు గోడౌనులు, మార్కెటింగ్ మార్క్ఫెడ్ అధికారులు పరిశీలించారు. కంపెనీలు కొనగా మిగిలిన ఉత్పత్తి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన పర్చూరు మార్కెట్ యార్డును మార్క్ఫెడ్ ఎండీ మంజీర్ జిలానీ సామూన్ సందర్శించి రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు నిల్వలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయినా ఎటువంటి కదలిక రాలేదు.
అయోమయంలో బర్లీ పొగాకు రైతులు
పర్చూరు పొగాకు కొనుగోలు కేంద్రంలో ప్రారంభం కాని కొనుగోళ్లు నేటికీ ప్రారంభించని ప్రభుత్వ అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్న కూటమి ప్రభుత్వం
ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం కొనుగోళ్లు ప్రారంభిస్తాం
గ్రేడింగ్ విషయంలో రైతులు ముందుకు రాకపోవడంతో కొనుగోళ్లు ప్రారంభించలేదు. రైతుకు మంచి ధర రావాలంటే గ్రేడింగ్ తప్పనిసరిగా చేయాల్సి ఉంది. పండిన పొగాకును మూడు గ్రేడులుగా విభజించాల్సిందిగా రైతులు సూచించి వారికి శిక్షణ ఇవ్వడం కూడా ఇచ్చాం. కానీ గ్రేడులు చేసేందుకు, ఆ విధంగా పంటను అమ్మేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక కొనుగోళ్లు మొదలు పెడతాం.
– కరుణశ్రీ,, డీఎం, మార్క్ఫెడ్