
‘కృష్ణ’లో హద్దు వివాదాలకు పరిష్కారం
కొల్లూరు : కృష్ణా నదిలో రెండు జిల్లాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలోని జువ్వలపాలెం వద్ద ఇసుక తవ్వకాలలో సరిహద్దు సమస్యలు తలెత్తాయి. గ్రామాన్ని ఆనుకొని ఉన్న కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక ప్రాంత వాసులు, బాపట్ల జిల్లా హద్దులు అతిక్రమించి ఇసుక తవ్వకాలు చేపటడ్డంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు, కృష్ణా జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రెండు జిల్లాల కలెక్టర్ల ఆదేశాలతో రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, మచిలీపట్నం ఆర్డీఓ స్వాతిలు జువ్వలపాలెం వద్ద సరిహద్దుల సమస్యను పరిష్కరించేందుకు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చర్చల అనంతరం నదిలో కొలతలు చేపట్టి జిల్లా సరిహద్దులు నిర్ణయించాలని తీర్మానించారు. సర్వేయర్లతో కొలతలు వేయించి తాత్కాలిక హద్దులు ఏర్పాటు చేశారు.
శాశ్వత హద్దు రాళ్ల ఏర్పాటుకు ఆదేశం
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హద్దుల స్థానంలో యుద్ధప్రాతిపదికన శాశ్వత హద్దు రాళ్లను నదీ ప్రవాహాన్ని తట్టుకొని నిలిచే విధంగా ఏర్పాటు చేయాలని కొల్లూరు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లును రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి ఆదేశించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆర్డీఓలు మాట్లాడుతూ సరిహద్దు సమస్య పరిష్కారమైన నేపథ్యంలో సమస్యలు పునరావృతం కాకుండా రెండు జిల్లాల ప్రజలు వ్యవహరించాలని సూచించారు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరించారు. నదిలో ఉచిత ఇసుక క్వారీలకు అనుమతులు మంజూరయ్యే వరకు ప్రస్తుతం అనుమతులున్న స్టాక్ యార్డుల నుంచి మాత్రమే రవాణా చేసుకోవాలని సూచించారు. నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేసిన పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నదిలో సరిహద్దుల సమస్య, ఇసుక తవ్వకాలపై త్వరలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు సీఐ పి.వి.ఆంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జానకి అమరవర్ధన్, కృష్ణా జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్డీఓల సమక్షంలో సర్వేయర్లతో కొలతలు
తాత్కాలిక హద్దుల ఏర్పాటు