
పోలీసులకు, అంబటికి మధ్య వాగ్వాదం
● జగన్ కాన్వాయ్ నిలిపేందుకు బారికేడ్లు ఏర్పాటు ● పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి ఆగ్రహం
మేడికొండూరు: కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కూటమి అరాచక పాలనలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి తాడేపల్లి నుంచి తన కాన్వాయ్తో బయలుదేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జగనన్నకు జేజేలు కొడుతూ అభిమానాన్ని చాటారు.
ప్రణాళిక ప్రకారమే...
జగనన్నకు ప్రజా ఆదరణ ఇంకెంత లభిస్తుందో అని కూటమి నేతలు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. జగన్ తన కాన్వాయ్లో సత్తెనపల్లి పట్టణ శివారులో చేరుకునేటప్పటికీ కూటమి నేతలు జగనన్న తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పథకం రచించారు. ఎలాగైనా జగన్ కాన్వాయ్కు పోలీసుల సహకారంతో బారికేడ్లు అడ్డుగా పెట్టి ఆపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇది గమనించిన వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బారికేడ్లను అడ్డు తీసివేయాలంటూ పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం జరిగింది. జగన్ కాన్వాయ్ ఆపే శక్తి ఎవరికీ లేదంటూ అంబటి రాంబాబు భావోద్వేగానికి లోనయ్యారు. జన సందోహం ఎక్కువగా ఉండటంతో బారికేడ్లను తీసివేయించారు. పోలీసులు చేసేదేమీ లేక బారికేడ్లను తొలగించి ముందుకు సాగించారు. ఇలా అడ్డుకోవడం కేవలం జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు చేస్తున్న వికృత చేష్టగా అంబటి మండిపడ్డారు. రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని అక్కడ ఉన్న పోలీసులను దుయ్యబట్టారు.