నేటి నుంచి బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలు

Jun 19 2025 4:40 AM | Updated on Jun 19 2025 4:40 AM

నేటి నుంచి బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలు

నేటి నుంచి బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలు

బాపట్ల: బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలును గురువారం నుంచి జిల్లాలో పునఃప్రారంభించాలని కలెక్టర్‌ జె. వెంకట మురళి అధికారుల్ని ఆదేశించారు. పొగాకు కొనుగోలుపై వ్యవసాయశాఖ, మార్క్‌ ఫెడ్‌ అధికారులతో కలెక్టరేట్‌ ఆవరణలోని ఈటీసీ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ధరలు తగ్గి భయంతో ఆందోళన చెందుతున్న పొగాకు రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, వారి ఇబ్బందులను తొలగించేలా ప్రతి ఆకు కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. బ్లాక్‌ బర్లీ పొగాకు కొనుగోలు చేయడానికి సీఎం యాప్‌ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇప్పుడు వరకు ఈ– క్రాప్‌, ఏపీ ఏఎంఎస్‌లో నమోదైన రైతుల వివరాలను సీఎం యాప్‌కు అనుసంధానించాలని ఆయన సూచించారు. ప్రతి పొగాకు రైతు వివరాలను అందులో నమోదు చేయాలని ఆదేశించారు. మార్క్‌ ఫెడ్‌ ద్వారా 25 మిలియన్‌ కేజీలను పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతుల కోసం పర్చూరులో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని, టోల్‌ ఫ్రీ నంబర్‌ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం గాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాలని తెలిపారు.అవగాహనతో వేరొక పంటలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సీఎం యాప్‌లో నమోదు చేసిన రైతుల నుంచి మాత్రమే పొగాకును కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుల పేర్లు, పంట, భూమి, ప్రాంతం, సర్వే నంబర్లను అనుసంధానించాలని చెప్పారు. ప్రస్తుతం పర్చూరులో రెండు, చీరాలలో ఒక కొనుగోలు కేంద్రం ద్వారా మార్క్‌ ఫెడ్‌ కొనుగోలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మార్క్‌ ఫెడ్‌ అధికారి కరుణశ్రీ , మార్కెటింగ్‌ శాఖ అధికారి రమేష్‌ బాబు, వ్యవసాయ, మార్కె ఫెడ్‌ అధికారులు పాల్గొన్నారు.

రైతులకు రాయితీ చెక్కుల పంపిణీ

బాపట్ల: చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాల సరఫరాలో రాయితీ మొత్తాన్ని కలెక్టర్‌ జె. వెంకట మురళి బుధవారం అందజేశారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాయితీపై పనిముట్లు పొందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ ఫామ్‌ మెకనైజేషన్‌, అగ్రికల్చర్‌ మెకనైజేషన్‌ కింద 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తోందని తెలిపారు. కర్షక పోర్టల్‌ ఆధారంగా లబ్ధిదారులను సాంకేతికంగా ప్రభుత్వ వివరాలను వినియోగించి పారదర్శకంగా ఎంపిక చేసి యంత్రాలను అందజేసినట్లు చెప్పారు. 577 మందికి ట్రాక్టర్‌తో నడిచే యంత్ర పరికరాలు, 42 మందికి రోటమేటర్లు, 51 మందికి బ్యాటరీ స్ప్రేయర్లు, 374 మందికి పవర్‌ స్ప్రేయర్లు, ఐదుగురికి ట్రాక్టర్‌ స్ప్రేయర్లు, మూడు పవర్‌ వీడర్లు, నలుగురికి బ్రష్‌ కట్టర్‌, ఐదుగురికి పవర్‌ టిల్లర్లను కలిపి 1,061 మందికి అందించినట్లు తెలిపారు. యాభై శాతం రాయితీలో భాగంగా మొత్తం రూ.2,10,2,358ను రైతులకు అందజేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో పలువురు చిన్న, సన్నకారు రైతులకు తైవాన్‌ స్ప్రేయర్‌లను అందజేశారు. కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మరాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, బావుడా చైర్మన్‌ సలగల రాజశేఖర్‌ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామకృష్ణ, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మి, బాపట్ల వ్యవసాయ అధికారి శారద, రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జె.వెంకట మురళి

నేడు పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం

పర్చూరు(చినగంజాం): పర్చూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు గురువారం పర్చూరు రానున్నట్లు మార్క్‌ఫెడ్‌ డీఎం కరుణశ్రీ తెలిపారు. ఉదయం 10.40 గంటలకు ఆయన పర్చూరు చేరుకుంటారని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement