
అన్నిదారులూ రెంటపాళ్లకే..
అరచేతిని అడ్డుపెట్టి అఖండ సూర్యుడి తేజస్సు అడ్డుకోలేనట్లు.. సంక్షేమ సూరీడు.. జన హృదయ నేతను చూసేందుకు వచ్చిన జన తరంగాన్ని ఆంక్షల వలయాలు అడ్డుకోలేకపోయాయి.. ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన సంద్రం ముందు నిర్బంధ చట్రాలు చిన్నబోయాయి.. బారులు తీరిన అభిమానం ముందు బారికేడ్లు దూదిపింజలయ్యాయి. ఏమా జనం.. ఏమిటా ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనట్లు.. నేల ఈనిందా అన్నట్లు వైఎస్ జగన్ కాన్వాయ్ అడుగు పెట్టిన ప్రతి ఊరు జనహోరుతో నిండగా.. ప్రతి సర్కిల్ అభిమాన సంద్రమైంది. తమ అభిమాన నేతను చూసిన ఆనందం.. ఏడాదిగా తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు వచ్చిన భావోద్వేగం ఏకమై దిక్కులు పిక్కటిల్లేలా.. కూటమి కుర్చీలు కదిలేలా.. జగన్నినాదమై వినిపించింది.
షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చేరుకోవలసిన జగన్మోహన్రెడ్డి అభిమాన హోరు ధాటికి సాయంత్రం 4:40 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే పార్టీ జెండాను ఎగురవేశారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్నా అధైర్య పడవద్దంటూ ధైర్యం నూరిపోసి అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దాడులు, అక్రమ కేసులు, వైఎస్సార్ సీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని బనాయిస్తున్న కేసులు, దాడులపై నిలదీశారు. అనంతరం సాయంత్రం 5:32 గంటలకు తిరిగి రోడ్డు మార్గాన తాడేపల్లి బయలుదేరారు.