వేమూరు: అక్రమ రేషన్ బియ్యం తరలింపుకు చుండూరు మండలం అడ్డాగా మారింది. వేమూరు నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం తరలింపు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రైస్ మిల్లులకు తరలిస్తున్నా రు. రైస్ మిల్లు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలంలోని నడిగడ్డవారిపాలెం గ్రామంలో రైస్ మిల్లు నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం అక్రమంగా తరలిస్తున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా అక్రమ రేషన్ బియ్యం తరలింపు జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అండతో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం సాగుతుందని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారులకు ఎమ్మెల్యే ఫోన్
చుండూరు మండలంలోని నడిగడ్డవారిపాలెం గ్రామంలో అక్రమ రేషన్ బియ్యం తరలించే రైస్ మిల్లు వద్దకు రెవెన్యూ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు వెళితే ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఫోన్ రావడంతో అధికారులు తిరిగి వస్తున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో పౌర సరాఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లులో అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు. తహసీల్దారు నాగరాజు రైస్ మిల్లు వద్దకు వెళుతుంటే ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఫోన్ రావడంతో తిరిగి వచ్చారు. దీంతో అధికారులు రైస్ మిల్లుపై దాడులు చేసేందుకు భయపడుతున్నారు.
నడిగడ్డి వారి పాలెం రైస్ మిల్లు నుంచి ఇతర రాష్ట్రాలకు తనిఖీలకు వెళితే ఎమ్మెల్యే నుంచి ఫోన్లు అధికారులపై దాడులు చేస్తున్న కుక్కలు
అధికారులపై కుక్కలు దాడులు
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న రైస్ మిల్లులో కుక్కలు అధికారులపై దాడులు చేస్తాయి. దీంతో రైస్ మిల్లు వద్దకు అధికారులు వెళ్లటానికి కూడా భయపడుతున్నారు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న బాల కోటిరెడ్డి రైస్ మిల్లులో కుక్కులను పెంచుతున్నాడు. రాత్రులు, పగలు సమయంలో కుక్కులను వదిలి పెడతాడు. దీంతో రైస్ మిల్లుపై వివిధ శాఖల అధికారులు దాడులకు వెళితే కుక్కలు దాడులు చేయడం జరుగుతుంది. అందువల్ల అధికారులు రైస్ మిల్లు వద్దకు వెళ్లాలి అంటేనే భయపడుతున్నారు. ఇక్కడ రైస్ మిల్లు నుంచి అక్రమ రేషన్ బియ్యం లారీలు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు.