జె.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని అలవలపాడు గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు.. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన దంపతులు తేళ్ళ యోహోషువా, ఏసురత్నం ఆదివారం తిమ్మసముద్రం గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు బైకుపై బయలుదేరారు. జాతీయ రహదారి నుంచి అలవలపాడు వైపు తిరిగాక గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
తాడేపల్లి రూరల్: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కుంచనపల్లిలో జరగింది. బంధువుల కథనం ప్రకారం.. కుంచనపల్లికి చెందిన నల్లపు సంజీవరావు, విజయ కుమారి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె కుక్కమల్ల సౌందర్య (26) 2022లో అదే గ్రామానికి చెందిన రాజును ప్రేమించింది. పెద్దలను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అదే గ్రామంలో భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే ఇటీవల సౌందర్యను రాజు, అతని కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధిస్తున్నట్టు సమాచారం. శనివారం రాత్రి తన భర్త వేధిస్తున్నాడంటూ తండ్రి సంజీవరావుకు సౌందర్య ఫోన్ చేసింది. ఆదివారం ఉదయం బాత్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి తండ్రి సంజీవరావు, కుమారులు ఆమె నివాసానికి వెళ్లారు. అప్పటికే సౌందర్యను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడకు వెళ్లగా సౌందర్య మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త, అతని తరఫు కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తన కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సంజీవరావు విలపించారు. ఆయన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని తుమ్మలచెరువు గ్రామం వద్ద ఆదివారం జరిగింది. వాహనం ఆచూకీ తెలియలేదు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. స్థానికులు సమాచారం మేరకు 108 సిబ్బంది నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒంటిపై పచ్చ రంగు గీతల చొక్కా ధరించి ఉన్నాడు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే సంప్రదించాలని పిడుగురాళ్ల పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు