సంతమాగులూరు (అద్దంకి): సంతమాగులూరు మండలం పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజావేదిక నిర్వహించారు. అధికారులతో సమీక్ష అనంతరం ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలు తీసుకున్నారు. ఆయా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. 80 మంది లబ్ధిదారులకు రూ.39 లక్షల చెక్కులను అందించారు. రూ.9 లక్షలకు ఎల్ఓసీ పత్రాలు అందజేశారు.
ప్రశాంతంగా పది పరీక్షలు
● పల్నాడు జిల్లాలో 99శాతం హాజరు
● పరీక్ష కేంద్రాలను సందర్శించిన అధికారులు
నరసరావుపేట ఈస్ట్: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 128 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్షకు 25,346 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 25,111 మంది హాజరయ్యారు. సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దూరవిద్య పదవ తరగతి తెలుగు, ఉర్దూ పరీక్షకు జిల్లాలోని 27 పరీక్ష కేంద్రాల్లో 1,151మందికి గాను 1,013మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన 13 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 75 కేంద్రాలను తనిఖీ చేశాయి. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురజాల, రెంటచింతలలోని నాలుగు కేంద్రాలు, జిల్లా పరీక్షల పరిశీలకులు ఎన్.గీత చిలకలూరిపేటలోని 11 పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జిల్లా పరిధిలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ చంద్రకళ తెలిపారు.
పరీక్షల డ్యూటీ నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల తొలగింపు
గురజాల : పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం డీఈవో చంద్రకళ తనిఖీ చేశారు. గురజాలలోని నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు రోజులు కిందట జరిగిన హిందీ పరీక్షలో ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు బిట్లు అందించారని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీఈవో కేంద్రాన్ని పరిశీలించారు. పల్లెగుంతలోని మోడల్ పాఠశాలలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పరీక్షల డ్యూటీ నుంచి తొలగించినట్లు ఆమె చెప్పారు.
లైఫ్ సర్టిఫికెట్లు
సమర్పించండి
నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులంతా లైఫ్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా అందజేయాలని జిల్లా ఖజానా, లెక్కల అధికారి కె.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దాదాపు 96 శాతం అందించారని, మిగిలిన వారు కూడా వెంటనే జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఆన్లైన్లో ధ్రువీకరణ పత్రం సమర్పించే సమయంలో సమస్యలు తలెత్తినా, వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నవారు సంబంధిత ఖజానా కార్యాలయ సిబ్బంది సహాయంతో మాన్యువల్గా సమర్పించవచ్చని ఆయన తెలిపారు. వివరాలకు ఖనాజా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
27న నిధి ఆప్కే నికత్
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈనెల 27న నిధి ఆప్కే నికత్ కార్యక్రమాన్ని ఆరు జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఇంద్రనీల్ ఘోష్ శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న సమావేశాల్లో యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖీగా చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈనెల 27న సెలవు దినంగా పరిగణించినచో మరుసటి రోజున యథావిధిగా నిధి ఆఫ్ కే నికత్ జరుగుతుందని పేర్కొన్నారు.