లక్ష్మీపురం: అణగారిన వర్గాలు, పేదల సమస్యల పరిష్కారం కోసం బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఉన్న మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన రెండు రోజుల రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలలో భాగంగా ఆదివారం మొదటి రోజు వర్క్షాప్ను సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ కోటేశ్వరరావు అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వాలు చెబుతున్న దానికి, ఆచరణలో జరుగుతున్న దానికి పొంతన లేకుండా ఉందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు గ్రామీణ పేదలు, చేతివృత్తుల వారికి నూతనంగా ఒక్క స్కీమ్ తీసుకువచ్చారా? అంటూ ప్రశ్నించారు. మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేంద్రం చూస్తోందన్నారు. లిఫ్టిక్ సంస్థ డైరెక్టర్ చక్రధర్ బుద్ద, డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రావు, అఫీస్ బేరర్స్ కాబోతు ఈశ్వరరావు, బి. వెంకటేశ్వరరావు, బి. కేశవరెడ్డి, చిలుకూరి వెంకటేశ్వరరావు, ఆర్.విజయ, సి.సుబ్రమణ్యం, కరిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.