● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె టౌన్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో అవగాహన సదస్సు అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంతో తలెత్తే పరిణామాలపై సందేశం ఇచ్చారు. ‘గంజాయి వద్దు బ్రో.. జీవితాలు ముద్దు’, ‘మత్తు జీవితాన్ని చేస్తుంది చిత్తు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులను చైతన్య పరిచారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటికి దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించు కోవాలని సూచించారు. ఏఎస్పీ, ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్ర మాట్లాడుతూ ప్రెండ్షిప్ పేరుతో మొదట దగ్గరగా చేరి ఉచితంగా గంజాయి, కూల్ లిప్స్కు అలవాటు చేస్తారని అప్పటికే ఆ మత్తుకు బానిసై గంజాయి లేకుంటే బతకలేని స్థితికి చేరుకుంటారన్నారు. ‘యాంటీ డ్రగ్’ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ అంధకారమై జీవితం నాశనం అవుతుందన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల చేత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ అజయ్, పెద్దమడ్యం ఉపాధ్యాయురాలు కళ్యాణ లక్ష్మి, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


