సాక్షి, మదనపల్లె : రైతులు పండిస్తున్న పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లెలోని రైతు సంఘం కార్యాలయంలో ఆ సంఘ జిల్లా ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పొగాకు, మిర్చి, పత్తి, జొన్న, వరి, టమాట పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం రైతు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి, కోల్డ్ స్టోరేజీలను నిర్మించాలని కోరారు. జిల్లా కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హంద్రీనీవా కాలువలు పూర్తి చేసి, చెరువులకు అనుసంధానం చేసి నీళ్లు ఇవ్వాలని కోరారు. పాడి పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోతోందని పాడి రైతులను ఆదుకోవాలని, పెట్టుబడి ఖర్చుకు తగినట్టుగా ధరలను పెంచాలన్నారు. టమాట రైతులను నష్టాల నుంచి గట్టెక్కించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని కోరారు. అనంతరం ఆ సంఘ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.మనోహర్ రెడ్డి, కార్యదర్శిగా ఎస్.రామచంద్ర, కమిటీ సభ్యులుగా ఎన్.వెంకటరమణారెడ్డి, ఎం.రమేష్ బాబు, సుబ్రమణ్యంరెడ్డి, పెద్ద రెడ్డప్ప ఎన్నికయ్యారు.


