కలసపాడు : మండలంలోని పోరుమామిళ్ల ప్రధాన రహదారి శంఖవరం, పిడుగుపల్లె గ్రామాల మలుపు వద్ద గురువారం కారు, ఆటో ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామానికి చెందిన వారు ఆటోలో మండలంలోని చెన్నుపల్లెలో తమ బంధువుల అంత్యక్రియలకు ఆటోలో వెళుతుండగా.. అదే సమయంలో బద్వేలుకు చెందిన వారు కొండపేటలో వారి బంధువుల వివాహానికి హాజరై తిరిగి బద్వేలుకు కారులో వెళుతున్నారు. ఈ రెండు వాహనాలు మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరాయుడు, నారాయణమ్మ, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బైక్లు ఢీకొని ఇద్దరికి..
పోరుమామిళ్ల : మండలంలోని కాలువకట్ట వద్ద గురువారం రెండు బైకులు ఢీకొనడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు కొత్తూరు, మరొకరు చింతలపల్లెకు చెందిన వారని తెలిసింది. బాధితులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
గోడ కూల్చివేతపై కేసు నమోదు
కడప అర్బన్ : కడప నగరం సీఎస్ఐ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవన గోడను కూల్చి వేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు కడప వన్టౌన్ ఎస్ఐ అమర్నాథరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. సీఎస్ఐ స్కూల్ ఆవరణలో నూతనంగా చర్చికి సంబంధించిన కమిటీ వారు భవనాన్ని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాన్ని ఆపాలంటూ కడపకు చెందిన డేనియల్ ప్రదీప్ మరి కొందరితో కలిసి గురువారం గోడను కూల్చివేశారు. చర్చికి సంబంధించిన సెక్రటరీ ఆనందరావు ఫిర్యాదు మేరకు డేనియల్ ప్రదీప్తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన మహిళలు


