రాయచోటి: ప్లాస్టిక్ రహిత సమాజం.... ప్లాస్టిక్ రహిత జిల్లా మన లక్ష్యం కావాలని.. స్వచ్ఛతను ప్రజలు దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రాయచోటి మున్సిపల్ ఆఫీసు నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర ర్యాలీలో పారిశుధ్య కార్మికులు, అంగన్ వాడీ వర్కర్లు, ఉద్యోగులతోపాటు కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టడం, ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లోని పారిశుధ్య పనులు, మరుగుదొడ్లు, బస్టాండ్లోని వసతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కలెక్టర్ చేతులు మీదుగా క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంకోసం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహశీల్దార్ నరసింహ కుమార్, డీపీఓ రాధమ్మ, రాయచోటి మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి, ఆర్టీసీ డీఎం మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నిశాంత్ కుమార్


