మదనపల్లె మున్సిపల్ ఆఫీసు ఆవరణలో సరికొత్త వింత ఒకటి వెలుగుచూసింది. ఎండ తీవ్రతకు జనం గొంతులు ఎండిపోతుంటే.. ఇక్కడ మాత్రం ప్రజల దాహం తీర్చాల్సిన ‘చలివేంద్రమే’ దాహంతో అల్లాడిపోతోంది! వేసవి రాగానే ఫొటోల కోసం ఆర్భాటంగా కుండలైతే పెట్టారు కానీ, అందులో నీళ్లు పోయడం మాత్రం మరిచిపోయారు. ఎండ దెబ్బకు కుండలు మాడిపోగా.. వాటి మూతల్లో నీళ్లకు బదులు మట్టి పేరుకుపోయింది. పన్నులు వసూలు చేయడంలో ఉండే శ్రద్ధ.. కనీసం కుండల్లో నీళ్లు నింపడంలో లేదంటూ వచ్చేపోయే జనం మున్సిపల్ ‘దొరల’పై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. – సాక్షి, మదనపల్లె


