డ్రగ్స్ నివారణలో బాబు సర్కారు విఫలం
మదనపల్లె అర్బన్: డ్రగ్స్, మత్తు పదార్థాల నివారణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ అనుబంధ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని విమర్శించారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డ్రగ్స్ నివారణపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువైందన్నారు. యువత మత్తుకు బానిౖసై జీవితాల ను నాశనం చేసుకుంటున్నారని వివరించారు. ముఖ్యంగా విచక్షణ కోల్పోయి నేరఘటనలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, పుంగనూరు, నెల్లూరు, జమ్మలమడుగు, అనంతపురంలో మాదకద్రవ్యాల వినియోగం మరింత ఎక్కువైందన్నారు. తాజాగా మదనపల్లెలోనూ..గంజాయి గుట్టు రట్టయిందన్నారు. ఓ మానవమృగం గంజాయి మత్తులో ఏడేళ్ల బాలికపై హత్యాచారం చేసిన ఘటన కలిచివేసిందన్నారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా డ్రగ్స్ నివారణలో కూటమి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి డ్రగ్స్, గంజాయి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, కాంగ్రెస్ నాయకులు రెడ్డిసాహెబ్, ఈశ్వరమ్మ, వీసీకే నాయకులు పీటీఎం శివప్రసాద్, సుదర్శన్, స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
● మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుర్గాభవానీ


