జిల్లా మార్పు ఉండదు
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు విషయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి జిల్లా బదలాయింపుపై వస్తున్న వదంతులపై వివరణ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చడం లేదని కొంత మంది పనిగట్టుకొని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి మాటలు ఇలా ఉంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన మీడియాలలో మాత్రం మదనపల్లిని జిల్లా చేయడంతో పాటు అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు ఉంటుందంటూ వస్తున్న వార్తలకు ఏం సమాధానం చెబుతారు అంటూ జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
రాయచోటి జగదాంబసెంటర్: సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అండ్ బోర్డ్ (సీసీఎస్సీ అండ్ ఎస్బీ) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సంయుక్త ఆధ్వర్యంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ 2025–26 నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 19 క్రీడా విభాగాల్లో జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయన్నారు. ఉద్యోగులు తమ పేర్లను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9154731106 నంబర్లో సంప్రదించాలని కోరారు.
రాయచోటి టౌన్: స్కౌట్ అండ్ గైడ్స్ కార్యక్రమంపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గైడ్ కెప్టెన్లకు డీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు. మంగళవారం రాయచోటి డైట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కౌట్ అండ్ గైడ్స్ కార్యక్రమం ద్వారా గైడ్ కెప్టెన్లకు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించి వారికి సూచనలు, సలహాలు అందించారు. స్కౌట్ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలు పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, లీడర్ ఆఫ్ ది కోర్స్ సుధాకర్, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, అడ్వాన్స్ గైడ్స్ కెప్టెన్ సుజాత, జిల్లా వ్యాప్తంగా ఉన్న గైడ్స్ కెప్టె న్లు పాల్గొన్నారు.
నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ నీలిపల్లెకు వెళ్లే దారిలో ఉన్న శ్రీ గౌతమ్ హైస్కూల్లో ఇద్దరు విద్యార్థులను ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు చితకబాదింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. బాధితుల కథనం మేరకు.. 7వ తరగతి చదువుతున్న పఠాన్ జైనాబ్ సుల్తానా, షేక్ నిహాల్ బాషా హోంవర్క్ చేయకపోవడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు అనుపమ తీవ్రంగా చితకబాదడంతో విద్యార్థుల చేతులకు వాతలు పడ్డాయి. ఇంటికి వెళ్లిన విద్యార్థులను తల్లిదండ్రులు గమనించి ఏమి జరిగిందని విచారించడంతో టీచర్ కొట్టిందని వారు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఉపాధ్యాయురాలిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బాధితులు వాపోయారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
జిల్లా మార్పు ఉండదు


