ఏపీ: అన్నదాతలకు అక్టోబర్‌లో సున్నా వడ్డీ రాయితీ  | Zero Interest Subsidy For AP Farmers In October | Sakshi
Sakshi News home page

ఏపీ: అన్నదాతలకు అక్టోబర్‌లో సున్నా వడ్డీ రాయితీ 

Aug 14 2021 6:47 AM | Updated on Aug 14 2021 6:48 AM

Zero Interest Subsidy For AP Farmers In October - Sakshi

చిన్న, సన్నకారు రైతులతోపాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్‌ ముగియకుండానే వడ్డీ రాయితీ జమ చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది.

సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులతోపాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్‌ ముగియకుండానే వడ్డీ రాయితీ జమ చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఖరీఫ్‌–2019 సీజన్‌లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, రబీ 2019–20 సీజన్‌లో 6.28 లక్షల మందికి రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేసింది. అలాగే టీడీపీ హయాంలో 42.32 లక్షల మందికి బకాయిపడిన రూ.784.72 కోట్లను కూడా చెల్లించింది. ఇప్పుడు ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు వచ్చే అక్టోబర్‌లో వడ్డీ రాయితీ జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఖరీఫ్‌–2020 సీజన్‌లో 86.17 లక్షల మంది రైతులకు రూ.1.47 లక్షల కోట్ల రుణాలిచ్చారు. వీరిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారు కనీసం 20 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. నిబంధనల ప్రకారం.. పంట రుణాలపై 7 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇందులో రైతులు తీసుకున్న పంట రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం భరిస్తోంది. మిగిలిన 4 శాతం వడ్డీని గతంలో రైతులే చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. తీసుకున్న రుణ మొత్తాన్ని వాయిదాలతో సహా ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతుల పొదుపు ఖాతాలకు ఈ వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులందరూ ఈ వడ్డీ రాయితీకి అర్హులు. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. వారు వేసిన పంటను తప్పనిసరిగా ఈ–క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేయించుకుని ఉండాలి.

ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం 
వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ పథకంపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే విధంగా రైతుల్లో చైతన్యం తెస్తున్నారు. అలాగే వారు సాగు చేసిన పంట వివరాలను తప్పనిసరిగా ఈ–క్రాప్‌ బుకింగ్‌ చేయించారో, లేదో పరిశీలించనున్నారు. గడువు తేదీలోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శించనున్నారు. అర్హులైన రైతుల వివరాలను వైఎస్సార్‌ఎస్‌వీపీఆర్‌ పోర్టల్‌లో గడువు తేదీలోపు బ్యాంకులు అప్‌లోడ్‌ చేసేలా పర్యవేక్షించనున్నారు.

సకాలంలో చెల్లించి రాయితీ పొందండి.. 
ఖరీఫ్‌–2020 సీజన్‌లో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సెప్టెంబర్‌ నెలాఖరులోపు తిరిగి చెల్లించిన వారందరికీ 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. గడువులోగా వడ్డీతో సహా పంట రుణాన్ని చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సమీప రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలి. 
హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement