ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శ
ప్రభుత్వం కక్షసాధింపులకు దిగడంపై ఆగ్రహం
సాక్షి, అమరావతి: డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి చెందిన విద్యా సంస్థలపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలతోపాటు, కల్తీ నెయ్యి ముసుగులో జరుగుతున్న హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహా న్ని ఎండగడుతూ శాసనమండలిలో, ప్రెస్మీట్లలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసినందుకు చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రశ్నించే గొంతును నొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 16 వేల మందికి పైగా విద్యార్థులు, 500 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తున్న సంస్థపై దాడులు చేసి రాజకీయ కక్షసాధింపులకు దిగడం హేయం.
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన వ్యాపారాలపై దాడులు చేస్తారా? ఇదే సంప్రదాయాన్ని రాబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తే చూడాలని అనుకుంటున్నారా?’ అని నిలదీశారు. డీఎస్సీలో ఏ తప్పూ జరగలేదని భావిస్తే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు కదా అంటూ విద్యాశాఖ మంత్రి లోకేశ్కు అప్పిరెడ్డి సవాలు విసిరారు.
నేడు నెల్లూరుకు వైఎస్సార్సీపీ నాయకుల బృందం
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఈ నెల 22న (సోమవారం) వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు వెళ్లి ఆయనను కలిసి భరోసా ఇస్తారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.


