
తాడేపల్లి : టీటీడీ గోశాలలో ఆవులు చనిపోవడంపై నిజా నిర్దారణ కమిటీ వేయాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి కారణాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో నిజానిర్దారణ చేయాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం మాట్లాడిన మల్లాది విష్ణు.. టీటీడీని రాజకీయ పునరావాసంగా మార్చేశారని ధ్వజమెత్తారు.
‘ఈరోజు కూడా కొందరు పాదరక్షలతో మహాద్వారం వరకు వెళ్లారంటే విజిలెన్స్ ఏం చేస్తోంది?, స్వామివారికి నైవేద్యం కూడా పది నిమిషాలు ఆలస్యంగా పెట్టారు. అసలు తిరుమలలో ఏం జరుగుతోంది?, గోమాతల మృతికి కారణం సరైన ఆలనాపాలన లేకపోవడమే. ఆహారం, పర్యవేక్షణ లేకనే గోవులు చనిపోయాయి.
టీటీడీ అధికారులు గోవుల మృతిపై ఎందుకు స్పందించలేదు?, సెలెబ్రిటీలే తప్ప సామాన్యులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకుండా చేశారు. టీటీడీని టీడీపీ ఆఫీసుగా మార్చారు. లోకేష్ పిఏ దందా కొండ మీద పెరిగి పోయింది. తిరుమలలో ఎగ్ పలావు దొరకటం, మద్యం దొరకటం ఏంటి?, క్యూలలో ఫ్రాంక్ వీడియోలు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు?, గోమాత టీడీపీ వారికి పబ్లిసిటీ కావచ్చు, మాకు మాత్రం సెంటిమెంట్.
గత చంద్రబాబు హయాంలో కూడా విజయవాడలో గోవులు చనిపోయాయి. టీడీపీ గోశాలలో గోవుల మృతిపై సుబ్రహ్మణ్య స్వామి పిల్ వేయాలనుకోవటం గొప్ప విషయం. ఆయన పోరాటం ఆయన చేస్తారు. మేము కూడా గోవుల మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. తిరుమలలో స్వామీజీలపై అరాచకంగా ప్రవర్తించారు. వారిపై పెట్టిన కేసులను తొలగించాలి. స్వామిజీలపై ఈ రకమైన కక్షసాధింపు మంచిది కాదు’అని మల్లాది విష్ణు హెచ్చరించారు.