జన హృదయ విజేత | YS Rajasekhara Reddy 77th Birth Anniversary | Sakshi
Sakshi News home page

జన హృదయ విజేత

Jul 8 2026 10:52 AM | Updated on Jul 8 2026 10:58 AM

YS Rajasekhara Reddy 77th Birth Anniversary

సాక్షి ప్రతినిధి, కడప :  ఒక్కరు.. ఇద్దరు కాదు, లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయి. కోట్లాది మంది పేదల మోముల్లో చిరునవ్వులు విరిశాయి. అగ్రవర్ణ పేదల తలరాతలు మారాయి. ఉన్నత చదువులతో స్థితిమంతులు అయ్యారు. ఫ్యాక్షన్‌  ఊబిలో చిక్కుకున్న కుటుంబాల జనరేషన్‌ మార్పుకు దోహదపడింది. ఇవన్నీ ఒకే ఒక్కరు చేశారు. ప్రజల కోసం, ప్రాంతం కోసం పరితపించిన నాయకుడాయన. రైతన్నలకు పెద్దన్నగా నిలిచారు. ముదసళ్లకు పెద్దకొడుకయ్యాడు. ఆయనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఇప్పటికీ జన హృదయ విజేతగా.. సంక్షేమ ప్రదాతగా కీర్తిస్తున్నారు. మరుపురాని మనిషిగా ప్రజల గుండెల్లో కొలువయ్యారు.  

ఆదర్శ నేతగా.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మనతో లేరు. ఆయన ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలు ఇప్పటికీ మనతో ఉన్నాయి, ఎప్పటికీ మరువరానివి కూడా. తరాల తరబడి దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్న పేదలకు ఫీజురీయింబర్స్‌మెంటు పథకం తలరాతలు మార్చివేసింది. అనారోగ్యం పాలైతే వల్లకాడే దిక్కు అన్న పదాన్ని రూపుమాపారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం పునర్జన్మ కల్పించింది. ఇల్లు లేని నిరుపేదల గోడును తీరుస్తూ గూడు కల్పించారు. అణగారిన వర్గాల ఉన్నతి కోసం రిజర్వేషన్లు కల్పించి చరిత్రను తిరగరాశారు. ఆరుగాలం శ్రమించినా ఫలితం దక్కని రైతన్నకు దన్నుగా నిలుస్తూ తోడునీడగా పెద్దన్న పాత్రను పోషించారు. వృద్ధులకు పెద్దకొడుకుగా, వితంతువులకు సోదరుడిగా... ఇలా చెప్పుకుంటూపోతే ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు ఏదో ఒక ప్రయోజనం కల్పించిన ఘనత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సొంతమైంది. ఓవైపు పన్నులు లేకుండా మరోవైపు సంక్షేమ పాలన చేపట్టి, ప్రభుత్వ పాలనంటే ఇలా ఉండాలని భవిష్యత్‌ తరాలకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆదర్శంగా నిలిచారని విశ్లేషకులు కొనియాడుతున్నారు.  

సొంత గడ్డపై ప్రత్యేక మమకారం 
నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్న కడప జిల్లాపై డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రత్యేక ముద్ర వేశారు. 2004లో ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని నలుమూలలా పరుగులు పెట్టించారు. 2004–09 వైఎస్‌ హయాంలో యోగివేమన యూనివర్సిటీ, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, పశువైద్య విద్య కళాశాల నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్‌ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్‌ ఆసుపత్రి, దంత వైద్యశాల, అలాగే ట్రిపుల్‌ ఐటీ, ఐజీ కార్ల్‌ పశు పరిశోధన కేంద్రం, దాల్మియా, భారతి సిమెంటు కర్మాగారాలు, గోవిందరాజా స్పిన్నింగ్‌ మిల్స్‌ తీసుకువచ్చారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను  శరవేగంగా చేపట్టారు. ఎన్నికలప్పుడు మాత్రమే శంకుస్థాపనలు చేసే తెలుగుదేశం పార్టీ నాయకులకు కనువిప్పు కలిగించారు. సుమారు రూ.12 వేల కోట్లు జలయజ్ఞంలో భాగంగా సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు.

మానవత్వం మూర్తిభవించిన నాయకుడు 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానవత్వం మూర్తిభవించిన నాయకుడు. ఇప్పటికీ అనంతపురం నుంచి అదిలాబాద్‌ వరకూ, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఆ పేరు ఉచ్చరిస్తే తెలుగు ప్రజల మనస్సు పులకిస్తుంది. మరుపురాని జ్ఞాపకంగా ప్రజానీకం గుండెల్లో కొలువయ్యారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని బుధవారం జిల్లా ప్రజానీకం ఘనంగా నిర్వహించుకునేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తనయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు వైఎస్‌ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు.

ఉన్నత చదువులు చదువుకున్నా.. 
ఈయన పేరు బి.అశోక్‌. బద్వేలులోని రఘునాథపురంలో నివాసం ఉంటున్నాడు. వీరిది సాధారణ రైతు కుటుంబం. ‘నేను ఉన్నత చదువులు చదువుకోగలిగానంటే దివంగత మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకమే. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలతోపాటు బీఈడీ, పీహెచ్‌డీలకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం ఎంతగానో ఆదుకుంది. ప్రస్తుతం ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల డీన్‌గా పని చేస్తున్నాను. ఇంతటి గౌరవం నాకు దక్కిందంటే అదంతా దివంగత వైఎస్‌రాజశేఖరరెడ్డి పుణ్యమే’ అని బి.అశోక్‌ పేర్కొంటున్నాడు.

తండ్రీతనయులు ప్రాణం పోశారు 
ఈ ఫొటోలో వ్యక్తి పేరు పెనుకొండ రామశేషయ్య. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్నాడు. వయసు 77 ఏళ్లు. లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 2009 ఏప్రిల్‌ 15న గుండె పోటు వచ్చింది.  ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా స్విమ్స్‌ ఆస్పత్రిలో గుండెకు స్టంట్‌ వేయించుకున్నారు. 2019లో మళ్లీ గుండె పోటు రావడంతో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్టంట్‌ వేయించుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు తమ కుటుంబంలో వెలుగులు నింపారని రామశేషయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ఆరోగ్యశ్రీతో పునర్జన్మ  
ఈయన పేరు రామసుబ్బారెడ్డి. రాజంపేటలో నివసిస్తున్నాడు. 2012లో హార్ట్‌ఎటాక్‌ వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో హైదరాబాద్‌లోని పెద్ద కార్పొరేట్‌ హాస్పిటల్‌లో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించుకున్నాడు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం తనకు పునర్జన్మనిచ్చిందని ఆయన పేర్కొంటున్నాడు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement