సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ దర్శకనిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు(71) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారాయన.
నిర్మాతగా, అనలిస్ట్గా తనదైన శైలిని ఏర్పరచుకున్న చిట్టిబాబుగారు.. సినీ రంగంపై ఆయనకు ఉన్న అవగాహన, విశ్లేషణాత్మక దృష్టి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించాలి అని ఒక ప్రకటనలో వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ఛాతి నొప్పి కారణంగా త్రిపురనేని చిట్టిబాబును కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన గుండెపోటుతో కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు.
ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. ఆయన అసలు పేరు వరప్రసాద్. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో 1955 జూలై 28న జన్మించారు. మొదట కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించారాయన. నటుడిగానూ 30 చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు చిత్రాలు తీశారు. రాజకీయాలపరంగా క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించారు.


