ఆర్బీకేలు అద్భుత ఆవిష్కరణలే

World Bank Senior Consultant Himmat Patel on Rythu Bharosa Centres - Sakshi

ప్రపంచ బ్యాంక్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ హిమ్మత్‌ పటేల్‌

గన్నవరం ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ సందర్శన

వణుకూరు ఆర్బీకేలో రైతులతో, ఘంటసాల కేవీకేలో విద్యార్థులతో భేటీ

సాక్షి, అమరావతి/అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఆవిష్కరణలు అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ బ్యాంకు సీనియర్‌ కన్సల్టెంట్‌ (అగ్రికల్చర్, ఫుడ్‌ గ్లోబల్‌ ప్రాక్టీస్‌) హిమ్మత్‌ పటేల్‌ పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులకు సేవలందించే ఆర్బీకేలు ఎంతో వినూత్నంగా ఉన్నాయని ప్రశంసించారు. వ్యవసాయంపై ఆధారపడ్డ దేశాలన్నీ వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రప్రభుత్వ సిఫార్సు మేరకు ఆర్బీకే తరహా వ్యవస్థ ఏర్పాటుకు ఆఫ్రికాలోని ఇథియోపియా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో హిమ్మత్‌ పటేల్‌ రాష్ట్రంలో పర్యటించి వీటి పనితీరును స్వయంగా పరిశీలించారు. మంగళవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కిసాన్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను సందర్శించారు. పెనమలూరు మండలం వణుకూరు ఆర్బీకే వద్ద రైతులు వినియోగించుకుంటున్న సేవలను పరిశీలించారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచుకునేం దుకు ఇథియోపియా సహకారం కోరిన సమ యంలో ఏపీలో ఆర్బీకేలు సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో రైతులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పారు. 

ఇంత టెక్నాలజీ ఎక్కడా లేదు..
‘ఆర్బీకేలు వన్‌స్టాప్‌ సెంటర్‌గా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని రకాల సేవలు గ్రామ స్థాయిలో అందించడంపై మాకున్న సందేహాలు ఇక్కడకు వచ్చాక పటాపంచలయ్యాయి. ఆర్బీకేల ద్వారా నిజంగా అద్భుతమైన సేవలందిస్తు న్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ని ఇంత బాగా వినియోగిస్తున్న ప్రభుత్వం బహుశా మరెక్కడా లేదు. ఈ తరహా సేవలను వ్యవసాయ ఆధారిత దేశాలన్నీ అందిపుచ్చుకోవాలి’ అని సూచించారు. ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఏపీలో పర్యటించి రాష్ట్ర ప్రభు త్వంతో ఎంవోయూ కుదుర్చుకోనుందని వెల్లడించారు.

గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కిసాన్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేసే రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, అధికారులు నివృత్తి చేస్తున్న తీరును హిమ్మత్‌ పటేల్‌ పరిశీలించారు. వణుకూరు ఆర్బీకేలో కియోస్క్‌ ద్వారా రైతులు ఇన్‌పుట్స్‌ బుకింగ్‌ చేస్తున్న తీరును పరిశీలించారు. వైఎస్సార్‌ సంచార వెటర్నరీ అంబులెన్స్‌ పనితీరును గమనించారు. ఘంట సాలలోని కృషివిజ్ఞాన కేంద్రాన్ని (కేవీకే) సందర్శించారు. 

సీఎం జగన్‌ కృషి అభినందనీయం
సీఎం వైఎస్‌ జగన్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకుని దూరదృష్టితో ఆర్బీకేలను ఏర్పాటు చేశారని, ఆయన కృషి అభినందనీయమని హిమ్మత్‌ పటేల్‌ ప్రశంసించారు. సీఎం జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకందిస్తున్న సేవలను వ్యవసా యశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వివరిం చారు. శాఖల వారీగా అందిస్తున్న సేవలను వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాల కొండయ్య, స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తెలియచేశారు.

కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్ర టరీ చిరంజీవి చౌదరి, ఉద్యాన, మత్స్యశాఖల కమిషనర్లు శ్రీధర్, కె.కన్నబాబు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ Ôశేఖర్‌బాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్, ఉద్యాన శాఖ అదనపు డైరెక్టర్లు ఎం.వెంకటేశ్వర్లు, బాలాజీ నాయక్, స్టేట్‌ ఆర్బీకేల ఇన్‌చార్జి శ్రీధర్, ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్‌ పి రాంబాబు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top