
వరదలు, విపత్తుల వేళ కానరాని సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ
2014లో విపత్తుల నిర్వహణ వ్యవస్థను అటకెక్కించిన అప్పటి పాలకులు
రాజకీయ ప్రాబల్యం పెరిగిపోవటంతో అధికారులకు సంకెళ్లు
పటమట (విజయవాడ తూర్పు): ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు కొండచరియలు విరిగిపడ్డాయి. తేరుకునేలోపే వెంటనే బుడమేరు సింగ్నగర్ సహా ఎన్నో కాలనీలను వరదతో ముంచెత్తింది. వరుస విపత్తులు ముప్పేట దాడిచేసి విజయవాడ నగర వాసులను భయం గుప్పెట్లోకి నెట్టేశాయి.
ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే రంగంలోకి దిగాల్సిన యంత్రాంగాల జాడ కనిపించకుండాపోయింది. ఇలాంటి సమయాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపత్తుల అనంతరం చేయాల్సిన విధులు, బాధ్యతలపై విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ యంత్రాంగం, పోలీస్, విపత్తుల నిర్వహణ సంస్థ, వైద్య–ఆరోగ్యం, స్త్రీ–శిశు సంక్షేమశాఖ, ఇంజనీరింగ్, జలవనరులు, స్థానిక ఎమ్మెల్యేలు, డ్వాక్రా సంఘాలు వంటి 13 శాఖలతో 2011లో ‘సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ’ఏర్పాటైంది.
సమన్వయ లోపమే కొంపముంచింది
వరుస విపత్తులు సంభవించి విజయవాడను అతలాకుతలం చేసినా.. ఒక శాఖతో మరో శాఖకు సంబంధం లేకపోవటం, వీఎంసీ–జిల్లా రెవెన్యూ విభాగాల మధ్య లోపించిన సమన్వయం, పోలీస్, రెవెన్యూ, జలవనరుల శాఖలు బాధితులకు సహాయ సహకారాలు అందించటంలో పూర్తిగా విఫలమయ్యాయి.
ఫలితంగా లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచి్చంది. సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఉందో లేదో తెలియని పరిస్థితులు, ఆయా శాఖలకు కనీస ప్రణాళిక లేకపోవటంతో ఈ దుస్థితి దాపురించింది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే యంత్రాంగం లేకపోవటం, ఎక్కడెక్కడ పునరావాస కేంద్రాలు ఉన్నాయో కూడా సమాచారం అందించకపోవడంతో ప్రజలు ఘోరవిపత్తును చవిచూడాల్సి వచ్చింది.
2014 తర్వాత విపత్తుల నిర్వహణ వ్యవస్థను అప్పటి పాలకులు అటకెక్కించడం, రాజకీయ ప్రాబల్యం పెరిగిపోవటం, అధికారులు తీసుకునే చర్యలపై అడుగడుగునా రాజకీయ నేతలు అడ్డుపడటంతో అధికారులకు సంకెళ్లు పడినట్టయ్యింది. ఫలితంగా అధికారులు సహాయక చర్యలను గాలికొదిలేయాల్సి వచి్చంది.
డిజాస్టర్ కమిటీలో ఎవరుండాలి!
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ చైర్మన్గా, పోలీస్ కమిషనర్ వైస్ చైర్మన్గా, జాయింట్ కలెక్టర్ కార్యదర్శిగా, ఇరిగేషన్ ఎస్ఈ, జిల్లా సివిల్ సప్లై అధికారి, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ పీడీ, సిటీప్లానర్, చీఫ్ ఇంజనీర్, చీఫ్ హెల్త్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్, స్థానిక ఎమ్మెల్యే, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్, డ్వాక్రా సంఘం ప్రతిని«ధి సభ్యులుగా సిటీ డిజాస్టర్ కమిటీ పని చేయాలి. ఈ కమిటీ వరద కార్యాచరణ ఏర్పాటు చేస్తుంది.
క్షేత్రస్థాయి సిబ్బంది, వివిధ విభాగాలు, శాఖల నుంచి వచ్చే సిబ్బంది ఈ కమిటీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. నగరవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించేందుకు గుణదల డాన్ బాస్కో స్కూల్, ప్రభుత్వ ప్రెస్, నందమూరినగర్, పాయకాపురం, భవానీపురం హెడ్వాటర్ వర్క్స్, రాజీవ్గాంధీ పార్క్లలో భారీ శబ్ధం వెలువడేలా అలారమ్లు గతంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసింది. అలాంటి ఏర్పాటు ఉన్న విషయం ప్రజలకు, అధికారులకు తెలియకపోవడం గమనార్హం.