సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటిలో(Tirupati Sanskrit Versity) లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత యువతి వీడియో స్టేట్మెంట్ రికార్డు చేసిన తిరుపతి మహిళా పోలీసులు.. కీలకమైన వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా నిందితులిద్దరినీ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
‘‘ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ నన్ను లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యా. అయితే ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద నా వ్యక్తిగత వీడియో ఉందని చెబుతూ లక్ష్మణ్ బెదిరింపులకు దిగాడు. ఆపై పలుమార్లు లైంగికంగా వేధించాడు. లక్ష్మణ్లాంటివాళ్లకు కఠినమైన శిక్ష పడాలి’’ అని పోలీసుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలస్తోంది.
తిరుపతి వెస్ట్ స్టేషన్ నుంచి మహిళా పోలీసుల బృందం ఒడిశా జార్హ్ పూర్లో బాధితురాలిని విచారించి.. ఈ మేరకు వీడియో స్టేట్ మెంట్ రికార్డు చేశారు. బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు.
నిందితుల ఆరెస్టును తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం మీడియా సమావేశంలో ధృవీకరించారు. ‘‘సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థిపై అనుచిత ప్రవర్తన ఘటన చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఫిర్యాదుతో వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఒడిషాకు చెందిన యువతి ఈ ఏడాది జూన్లో బీఈడీ కోర్సులో జాయిన్ అయింది. అయితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న లక్ష్మణ్ కుమార్ తన హోదాను వినియోగించుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినితో చనువుగా ఉంటున్న దృశ్యాలను శేఖర రెడ్డి అనే వ్యక్తి చిత్రీకరించాడు. ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఒడిషాకు పంపి బాధితురాలి నుంచి ఆధారాలను సేకరించాం. లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని వెల్లడించారు.
పార్లమెంట్లో ఆందోళన..
తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్లోనూ చర్చ జరిగింది. లోక్సభలో సోమవారం అడ్జర్న్మెంట్ మోషన్ నోటీసు ద్వారా వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని సభలో తెలిపారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించారన్నారు. అది అత్యంత హేయమ చర్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థినిపై ఇటువంటి దురాగతం జరగడం పట్ల పార్లమెంట్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు.


