ఆశాజనకంగా లేని పొగాకు ధరలు
భారీగా నష్టాలు తప్పవంటున్న రైతులు
వేలం ప్రారంభం నుంచి పడిపోతున్న ధరలు
బ్రైట్ గ్రేడ్ పొగాకు ప్రారంభంలో కేజీ రూ.250
ప్రస్తుతం కేజీ ధర రూ.232 నుంచి రూ.235 మాత్రమే
ప్రస్తుత ధరలతో ఎకరాకు రూ.20 నుంచి రూ.50 వేలు నష్టం తప్పదంటున్న రైతులు
ఇదే కొనసాగితే ఆత్మహత్యే శరణ్యం అంటూ రైతుల వేదన
వేలం కేంద్రాల్లో పొగాకు ధరలు రైతులను కుంగదీస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇది రైతుల పాలిట ఆశనిపాతంలా మారింది. వేలం కేంద్రాల్లో ప్రస్తుతమున్న పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా కోలుకోలేమనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభ ధర రూ.250 ఉండగా నేడు రూ.232కు పడిపోయింది.
బ్రైట్ రకం ధరలే ఇలా ఉంటే లోగ్రేడ్ ధరలు మరింతగా దిగజారుతాయన్న బెంగ రైతులకు పట్టుకుంది. ప్రకృతి కరుణించకపోవడం, తెగుళ్ల కారణంగా దిగుబడి భారీగా పడిపోయింది. దీనికి తోడు పశ్చిమాశియా యుద్ధం రైతుకు గోరుచుట్టపై రోకటి పోటుగా తయారైంది. ఈ ఏడాది ఎకరాకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు నష్టం తప్పదని రైతులు దిగాలు చెందుతున్నారు.
సింగరాయకొండ: పొగాకు రైతుకు కనకవర్షం కురవటం ఇక కలేనా అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో లాభాలు చవిచూశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఫలితంగా రైతులకు కాసుల వర్షం కురిసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచేస్తున్నా ప్రభుత్వం పట్టించున్న దాఖలాల్లేవు. ఫలితంగా వేలం కేంద్రాల్లో కనీస మద్దతు ధర లభించక ఎక్కువ మంది రైతులు పొగాకును వచ్చిన ధరకు తెగనమ్ముకున్నారు.
మరికొంత మంది శీతల గోదాముల్లో దాచుకున్నారు. గత సంవత్సరం ప్రారంభ ధర కేజీ రూ.320కి పైగా పలికింది. ఈ దఫా కేజీ ప్రారంభ ధర రూ.250 ఉండగా ప్రస్తుతం కేజీ ధర రూ.232 పలకటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాలున్నాయి. 2026–27 పంట సీజన్కు సంబంధించి రీజియన్ పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
2026–27 లో పంట సీజన్కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. కానీ ఈ ఏడాది సుమారు 130 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు.
ధరతో దిగాలు..
ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రాల్లో ప్రారంభం నుంచి బ్రైట్గ్రేడ్ పొగాకు కేజీ ధర రూ.250 పలికింది. తరువాత ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కర్ణాటకలో పొగాకుకు సరాసరి కేజీ ధర రూ.230 వచ్చిందని ఇక్కడ కూడా ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ వేలం ప్రారంభమైన కొద్దిరోజులకే కేజీ ధర రూ.232 లకు పడిపోవడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు.
గిట్టుబాటు ధర లభించేనా
ప్రస్తుతం వేలం కేంద్రాల్లో లభిస్తున్న ధరలను చూస్తే రైతులకు నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. కొండపి వేలం కేంద్రంలో కేజీ ధర రూ.232 ఉండగా, టంగుటూరులో కేజీ ధర రూ.235, కందుకూరులో కేజీ ధర రూ.245 ఉంది. ఈ ప్రకారం రైతుకు ఎకరాకు ఒక్కో బ్యారన్కు రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టం సంభవిస్తుందని ఈ విధంగా అయితే ఎలా బట్టకట్టాలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆశాజనకంగా లేని దిగుబడులు:
ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవటంతో పాటు మంచు కారణంగా తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు 9 క్వింటాళ్ల దిగుబడి రాగా కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు కేవలం 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు. జరుగుమల్లి మండలం నందనవనం తదితర ప్రాంతాల్లో అక్టోబర్లో సాగు ప్రారంభించటంతో పాటు వర్షాలు కురవటంతో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, అదే చాలా ప్రాంతాల్లో నవంబర్లో సాగు ప్రారంభించటంతో సకాలంలో వర్షాలు లేక దిగుబడి 5 నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత ధరలతో ఆత్మహత్యలే శరణ్యం:
ఈ ఏడాది పొగాకు ధరలు తగ్గటంతో పాటు యుద్ధం కారణంగా కొనుగోలుదారులు లేక ధరలు బాగా దిగజారే పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేంద్రానికి బేళ్లు తీసుకెళ్తే వాటిని నానా పరీక్షలు చేసి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు 45 బేళ్లు తీసుకుని వెళ్తే కేవలం 27 బేళ్లు మాత్రమే కొనుగోలు చేసి 18 బేళ్లు వెనక్కి తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఆత్మహత్యలే శరణ్యమని ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పటానికి వీలు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుందని రైతులు గుర్తుచేశారు. గతంలో వ్యాపారులు సిండికేట్ అయి పొగాకు ధరలు పడిపోతుంటే గత ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని, వీరు ఎంతసేపటికీ దోచుకో, దాచుకో అన్న సిద్దాంతం.. లేకపోతే జగన్మోహన్రెడ్డి ని విమర్శించటానికే సమయం కేటాయిస్తున్నారే తప్ప పొగాకు రైతును ఆదుకునే ఒక్క ప్రయత్నం చేపట్టిన దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు సాగు తగ్గించండి ప్రత్యామ్నాయ పంటలను పండించండని చెప్పటమే తప్ప ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఆలోచన మాత్రం లేదని, ఈ ప్రభుత్వంలో కష్టాలే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బేళ్లు వెనక్కు పంపుతున్నారు
ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభంలో కేజీ ధర రూ.250 ఉండగా, ప్రస్తుతం రూ.232 పలుకుతుంది. యుద్ధం వంక చూపి వ్యాపారులు బేళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపకుండా ఆంక్షలు విధిస్తూ బేళ్లు తిప్పి పంపుతున్నారు. అసలే నష్టాలు వస్తాయి ఎలా అని బాధపడుతుంటే బేళ్లు వెనక్కి పంపటం అదనపు భారంగా మారింది. – తాటికొండ రామచంద్రరావు, రైతు, పచ్చవ
ఎకరాకు రూ.40 వేలు నష్టం
ఈ ఏడాది 40 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. ప్రస్తుతం కేజీ ధర రూ.232 మాత్రమే ఉంది. కేజీ ధర రూ.260 పైన ఉంటేనే గిట్టుబాటవుతుంది. ప్రస్తుత ధరలతో ఎకరాకు సుమారు రూ.40 వేలు నష్టమొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకునేందుకు కృషి చేయాలి. – నాగినేని భాస్కర్, పొగాకు రైతు, పైడిపాడు
కేజీ రూ.270పైన ఉంటేనే గిట్టుబాటయ్యేది
నేను 29 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కేజీ ధర రూ.270 పైన ఉంటేనే గిట్టుబాటవుతుంది. వర్షాలు సరిగా కురవకపోవటం, తెగుళ్ల కారణంగా దిగుబడి ఆశించినంతగా లేదు. మందుల ఖర్చులు బాగా పెరిగాయి. ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టి ఆదుకోవాలి. – పిన్నిక శ్రీనివాసరావు, పొగాకు రైతు, పంగులూరివారిపాలెం


