పెట్రోల్, డీజిల్‌ నిక్షేపాల వెలికితీతకు ట్రయల్‌ రన్‌ | Trial run for extraction of petrol and diesel deposits | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్‌ నిక్షేపాల వెలికితీతకు ట్రయల్‌ రన్‌

Published Fri, Mar 14 2025 5:39 AM | Last Updated on Fri, Mar 14 2025 5:39 AM

Trial run for extraction of petrol and diesel deposits

శాటిలైట్‌ ద్వారా నిర్ధారించిన పాయింట్లలో బోరుబావుల తవ్వకాలు

లింగాల: వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలంలో డీజిల్, పెట్రోలు నిక్షేపాలను కనుగొనేందుకు బోరుబావుల తవ్వకాల ద్వారా ట్రయల్‌ రన్‌ ప్రారంభించారు. శాటిలైట్‌ ద్వారా నిర్ధారించిన పాయింట్లలో ఈ తవ్వకాలకు నాలుగు రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. సుమారు 80–200 అడుగుల లోతు వరకు ఈ బోరుబావులను తవ్వుతున్నారు. ఆ తర్వాత వాటి అడుగు భాగంలో డైనమైట్లు, జిలెటిన్‌ స్టిక్స్, మందుగుండు సామాగ్రి పంపి పేలుస్తున్నారు.

అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పేలుళ్లవల్ల చుట్టుపక్కల వ్యవసాయ బోరుబావులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. రైతుల అనుమతుల్లేకుండా వారి పంట పొలాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదా.. లింగాల మండల కేంద్రంలోని ఎ.వి. శ్రీనివాసరెడ్డి పొలంలో అనుమతిలేకుండా తొమ్మిది బోరు బావులు తవ్వారు. 

జిల్లా కలెక్టర్‌ అనుమతులతో ఓఎన్‌జీసీ సంస్థ బోరు­బావులు తవ్వుతోందని తహసీల్దార్‌ ఈశ్వరయ్య తెలిపారు. రెండ్రోజుల క్రితం కలెక్టర్‌ ఇచ్చిన అను­మతుల కాపీని తనకు అందించారన్నారు. ఇక ముది­గుబ్బ నుంచి జమ్మలమడుగు వరకు బోరుబావుల తవ్వకాల కాంట్రాక్టును బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ సోదరుడు సురేష్‌ పొందినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement