చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
విజయవాడ ఇన్ఛార్జి సీపీ సర్వశ్రేష్ట త్రిపాఠి
లబ్బీపేట(విజయవాడతూర్పు)/విజయవాడలీగల్: ఆన్లైన్ రాడికలైజేషన్, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయవాడ నగరానికి చెందిన ముగ్గురిని దేశద్రోహం కేసులో అరెస్టు చేసినట్లు ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ట త్రిపాఠి చెప్పారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు.
నిందితులు మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సొహైల్ సామాజిక మాధ్యమాల్లో సంఘటిత గ్రూపులను నిర్వహిస్తూ, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన డిజిటల్ కంటెంట్ను వ్యవస్థీకృతంగా ప్రచారం చేస్తున్నట్లు, సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తులను ఆకర్షించడం, నియమించుకునే యత్నాలు చేస్తున్నట్లు బయటపడిందని పేర్కొన్నారు.
వారు దేశం వెలుపల ఉన్న కొంత మంది వ్యక్తులతోనూ సంబంధాలు కలిగి ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించామని వివరించారు. మొబైల్ ఫోన్లు, అనుమానాస్పద వస్తువులతోసహా పలు ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని త్రిపాఠి వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీపీ కృష్ణకాంత్పటేల్, ఏసీపీ లతాకుమారి, ఏడీసీపీ జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గన్లు ఇస్తే యుద్ధం చేయాలనిపిస్తోంది!
అనంతరం నిందితులను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరచడంతో న్యాయమూర్తి బి.రాధారాణి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో నిందితులు ‘పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్పై జరుగుతున్న యుద్ధం మమ్మల్ని కలచివేశాయి.. గన్లు, మారణాయుధాలు ఇస్తే అక్కడకు వెళ్లి యుద్ధం చేయాలనిపిస్తోంది’’ అని చెప్పారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులోనూ పేర్కొన్నట్లు సమాచారం.


