ఎన్‌ఎంఆర్‌పై వైద్యుల నిర్లిప్తత | There are 13 lakh doctors across the country but only ten thousand people apply | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎంఆర్‌పై వైద్యుల నిర్లిప్తత

May 4 2025 6:18 AM | Updated on May 4 2025 6:18 AM

There are 13 lakh doctors across the country but only ten thousand people apply

ఎనిమిది నెలల్లో ఒక్కశాతం లోపే నమోదు!

గత ఏడాది నేషనల్‌ మెడికల్‌ రిజిస్టర్‌కు ఎన్‌ఎంసీ శ్రీకారం  

దేశవ్యాప్తంగా 13 లక్షల మంది వైద్యులుంటే పదివేల మంది మాత్రమే దరఖాస్తు 

రాష్ట్రం నుంచి 500 మందే రిజిస్ట్రేషన్  

ముందుకు సాగని యూనిక్‌ ఐడీ జారీ ప్రక్రియ

సాక్షి, అమరావతి: దేశంలో అర్హులైన అల్లోపతిక్‌ (ఎంబీబీఎస్‌) వైద్యులకు యూనిక్‌ ఐడీ జారీ చేయడం కోసం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) గతేడాది నేషనల్‌ మెడికల్‌ రిజిస్టర్‌(ఎన్‌ఎంఆర్‌)ను ప్రారంభించింది. వైద్య విద్య చదివి ప్రాక్టీస్‌ చేసే వైద్యుల కచ్చితమైన వివరాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఎన్‌ఎంఆర్‌కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

ఎనిమిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఒక శాతం లోపు వైద్యులు మాత్రమే దేశ వ్యాప్తంగా రిజిస్టర్‌ అయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి దేశంలో జాతీయ, రాష్ట్ర వైద్య మండళ్లలో రిజిస్టరైన మెడికల్‌ ప్రాక్టీషనర్లు 13 లక్షలపైగా ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకూ 10,411 మంది వైద్యులు మాత్రమే ఎన్‌ఎంఆర్‌లో రిజిస్టర్‌ చేసుకోగా, 10,237 మంది దరఖాస్తులు ఆమోదం పొందాయి. మిగిలిన దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఏపీ వైద్య మండలిలో 1.38 లక్షల మంది రిజిస్టర్డ్‌ వైద్యులు ఉన్నారు. 2016లో విభజిత ఏపీలో వైద్య మండలిలో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించగా ఇప్పటి వరకూ 40 వేల మంది వైద్యులు సభ్యత్వం పొందారు. వీరిలో ఇప్పటి వరకూ 500 మంది మాత్రమే ఎన్‌ఎంఆర్‌కు దరఖాస్తులు చేసుకున్నట్టు వెల్లడైంది.

సంక్లిష్ట రిజిస్ట్రేషన్ ప్రక్రియతోనే తలనొప్పి 
ఎన్‌ఎంసీ రూపొందించిన ఎన్‌ఎంఆర్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతో సంక్లిష్టంగా ఉండటంతో తలనొప్పిగా మారిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌ఎంఆర్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి వైద్యులు ఆధార్, ఎంబీబీఎస్‌ డిగ్రీ పట్టా, జాతీయ/రాష్ట్ర స్థాయి వైద్య మండలి జారీ చేసిన గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వైద్యుడు సమర్పించిన పత్రాలను సంబంధిత వైద్య మండలికి పంపి ధ్రువీకరిస్తారు. దరఖాస్తులోని వివరాలు సరైనవా? కావా? అన్నది సంబంధిత వైద్య కాలేజీకి పంపి నిర్ధారిస్తారు. ఈ వివరాలన్నీ సరైనవని తేలిన అనంతరమే ‘ఎన్‌ఎంఆర్‌ ఐడీ’ జారీ అవుతుంది.

ఒకసారి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి సమర్పించిన అనంతరం తప్పు జరిగితే సవరించడానికి వీల్లేకుండా చేశారు. వైద్య మండళ్లు  తమకు వచ్చిన దరఖాస్తుల్లో సవరణలు చేయడానికి వీలు కల్పించ లేదు. ఎన్‌ఎంసీ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలన సమయంలో సందేహాలు తలెత్తితే సంబంధిత వైద్యులను సంప్రదించడానికి ఫోన్‌ నంబర్‌/మెయిల్‌ ఐడీ వివరా­లు వైద్య మండళ్లకు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా వ్యక్తిగత వివరాలు, వైద్య మండళ్ల పేర్లు ప్రస్తుత డేటాతో సరిపోలకపోతే వైద్యులు అఫిడవిట్‌ను సమర్పించాలనే నిబంధన పెట్టారు. ఈ సమస్యల వల్ల వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement