చిత్తూరు: ‘‘ఆయన పేరు చెబితే వదిలేయాలి. లేకుంటే ఏమవుతుందో తెలుసా? ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదు’’ అంటూ చిత్తూరుకు చెందిన టీడీపీ నేత అనుచరులు పోలీసులపై రెచ్చిపోయారు. జీడీ నెల్లూరు పరిధిలో అధికార పార్టీ నేతల అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే ఈ హెచ్చరికలు. గంగాధరనెల్లూరు పరిధిలో దొంగ బిల్లులతో అక్రమంగా కొల్లగొడుతున్న గ్రానైట్ స్లాబ్ లారీని మంగళవారం రాత్రి స్థానిక పోలీసులు పట్టుకోవడమే పెద్ద నేరమైపోయింది. తమ అక్రమ సంపాదనకు అడ్డుపడ్డారనే కక్షతో చిత్తూరు నగరానికి చెందిన ఓ ప్రముఖ టీడీపీ నేత అనుచరులు పోలీస్ స్టేషన్పై పడి వీధి రౌడీల్లా ప్రవర్తించారు.
ఎలాంటి చెల్లుబాటు అయ్యే బిల్లులు లేకుండా, అక్రమ మార్గంలో భారీ గ్రానైట్ స్లాబ్లతో వెళ్తున్న లారీని జీడీ నెల్లూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. లారీని పోలీస్ స్టేషన్కు తరలించి చట్టపరమైన చర్యలు చేపడుతుండగా, విషయం తెలుసుకున్న సదరు టీడీపీ నేత తన అనుచరులను రంగంలోకి దింపారు.
సుమారు ఆరుగురు అనుచరులు మద్యం మత్తులో తూగుతూ పోలీస్ స్టేషన్లోకి దూసుకొచ్చారు. ‘‘మా లారీనే ఆపుతారా? గత రెండేళ్లుగా లేని ధైర్యం మీకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందిరా?’’ అంటూ విధుల్లో ఉన్న పోలీసుపై బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ స్టేషన్లోనే మద్యం మత్తులో పచ్చ ముఠా చేసిన హంగామాతో స్థానిక ప్రజలు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్రమ గ్రానైట్ దందాను అడ్డుకున్నందుకు ‘పచ్చ సంస్కృతి’పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా.. లేక అధికార ఒత్తిళ్లకు తలొగ్గుతారా వేచి చూడాల్సిందే!


