Sribagh Agreement In 1937 For Rayalaseema - Sakshi
Sakshi News home page

‘సీమ’ గర్జన: 1937 పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే..

Published Mon, Dec 5 2022 8:51 AM

Sribagh Agreement in 1937 For Rayalaseema - Sakshi

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు రాయలసీమ వాసులు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల భారీ బహిరంగ సభకు వేదిక కానుంది.దీనికి మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు.

పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముందంటే..
వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది. 

ఈ విధంగా 1937 నాడే ఆంధ్ర – రాయలసీమ పెద్దలు పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణకు తొలి అడుగు వేశారు. ఈ ఒప్పందంపై నమ్మ కంతోనే ఆంధ్రరాష్ట్రం సాధనలో సీమవాసులు ముందుండి పోరాడారు. 1952లో సిద్ధేశ్వరం అలుగు శంఖు స్థాపన చేస్తామని ముందుకొచ్చిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ ఆఫర్‌ను కూడా కాదనుకొని నిలిచారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. మూడేళ్ళకే 1956లో కర్నూలు రాజధాని హైదరాబాదు చేరింది. సీమలోని సిద్ధేశ్వరంను వదిలేసి నాగార్జున సాగర్‌ నిర్మాణం చేపట్టారు. శ్రీ బాగ్‌ ఒప్పందం అటకెక్కింది. 

దశాబ్దాల తర్వాత తెలంగాణ విడిపోయింది. శ్రీబాగ్‌ ఒప్పందం పునాదిగా 1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే మనముందు ఇప్పుడు నిలిచింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారూ శ్రీ బాగ్‌ సాక్షిగా వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటాలని, కేవలం పాలనా రంగంలోనే కాక జల వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల కోసం అడుగు ముందుకు వేయాలనే సంకల్పంతో నేడు(సోమవారం) చేపట్టిందే రాయలసీమ గర్జన. రాష్ట్ర విభజన సమయంలో సైతం ఇక్కడ ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. అధికార వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని తుంగలోకి తొక్కారు.  

Advertisement
Advertisement