సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో గురువారం రాత్రి గంజాయి మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. కత్తులు, కర్రలు చేతపట్టి వీధుల్లో వీరంగం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. కర్రలతో పలు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గంజాయి బ్యాచ్ అరాచకాలు స్థానికంగా సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తం అయ్యాయి. స్థానికుల సమాచారంతో యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై భోజ్యానాయక్ తెలిపారు. సంగంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని, అసలు గంజాయి వీరికి ఎక్కడి నుంచి లభ్యమవుతోందో తెలుసుకుని పూర్తిస్థాయిలో అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.


