ఏలూరు జిల్లా: సీమంతం చేసుకోడానికి సిద్ధమైన బాలింత రాత్రికి రాత్రి గుండెపోటుతో మరణించిందని దృశ్యం సినిమా రేంజ్లో భర్త, మామ అల్లిన కట్టుకథను పోలీసులు ఛేదించారు. కైకలూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, సీఐ వి.రవికుమార్, ఎస్సై రామచంద్రరావు కేసు వివరాలు శుక్రవారం వెల్లడించారు. మండవల్లి మండలం నాగభూషణపురం గ్రామానికి చెందిన నగుళ్ల ప్రదీప్కు విజయవాడ సమీపంలో ఎనికేపాడుకు చెందిన మేఘన(25)తో 2025, మే 8న వివాహమైంది. మేఘన ఇంజనీరింగ్ చేసి హెచ్ఆర్ క్లౌడ్ సెంటర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది.
ప్రదీప్ డిగ్రీ పూర్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను క్రైస్తవమతంలోకి మారాడు. వివాహానంతరం భార్య పూర్తిగా తన ఆధీనంలో ఉండాలని, సంపాదన తనకే ఇవ్వాలని, పుట్టింటి వారితో మాట్లాడవద్దని, మతపరమైన విషయాలపై తరుచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో అట్లతద్ది వాయినాలు భార్య తీసుకుందని నాలుగు నెలలు పుట్టింటికి పంపించేశాడు. విడాకులు ఇస్తానని బెదిరించాడు. దీంతో పెద్దలు సర్దిచెప్పి లోకుమూడి గ్రామంలో ఉంటున్న భర్త వద్దకు ఈ ఏడాది ఫిబ్రవరి 4న మేఘనను పంపారు. కొద్దిరోజుల్లో సీమంతం చేసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఫిబ్రవరి 9న గుండెపోటుతో మేఘన మరణించిందని 108 వాహనం తీసుకొచ్చి భర్త హడావుడి చేశాడు.
దొరికారు ఇలా..
2026, ఫిబ్రవరి 9న రాత్రి మేఘన ఉద్యోగానికి సంబంధించిన పని ముగించుకుని ఆలస్యంగా పడుకుంది. అర్ధరాత్రి నీరు తాగడానికి లేచింది. ఆ సమయంలో భర్త ప్రదీప్తో గొడవ జరిగింది. ముందస్తు ప్లాన్లో భాగంగా ప్రదీప్ ఆమె పీక గట్టిగా నొక్కి, తర్వాత తలదిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఈ విషయాన్ని పక్క గదిలో తండ్రి నరసింహారావుకు చెప్పాడు. ఇద్దరు ప్లాన్ ప్రకారం గుండెపోటు వచ్చిందని 108 వాహనం పిలిచి హాస్పటల్కు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించిందని చెప్పారు. మృతిరాలి తల్లి రమాదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో హత్య చేశారని నిర్ధారణైంది. భర్త కూడా చేసిన నేరం అంగికరించడంతో తండ్రితో సహా ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కేసులో ప్రతిభ చూపిన సీఐ, ఎస్సైలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు.


