లేదంటే రోడ్లు వేసేది లేదు
మంత్రి సంధ్యారాణి బెదిరింపులు
మక్కువ (సాలూరు): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అంటూ ఓట్లేయించుకుని, అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు.. రెండేళ్లుగా ఏ అభివృద్ధీ చేయలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి అంటూ ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇదే తరహాలో ప్రజలను బెదిరిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మండలంలో పలు పంచాయతీలకు రోడ్లు లేవని, తాను ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కొత్తగా వేయిస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ఒక షరతు పెట్టారు.
మండలంలోని 18 పంచాయతీలకు రోడ్లు వేయాలంటే ముందుగా ఆ పంచాయతీలన్నింటిలో తెలుగుదేశం అభ్యర్థులనే గెలిపించాలన్నారు. టీడీపీ సర్పంచులు గెలిస్తేనే రోడ్లు వేయిస్తానని, లేకుంటే వేసేది లేదని బహిరంగంగానే ప్రకటించారు. ఆమె మాటలు విని ప్రజలు విస్తుపోయారు. రాష్ట్రానికి మంత్రిగా ఉండాల్సిన సంధ్యారాణి తెలుగుదేశం కార్యకర్తగా మాట్లాడుతూ తమకు ఓట్లు వేస్తేనే అభివృద్ధి చేస్తామని లేకపోతే ఇబ్బందులు తప్పవని బాహాటంగా ప్రకటించడం ఏమిటని విమర్శిస్తున్నారు. గిరిజన మహిళా మంత్రి అయి ఉండీ తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన సంధ్యారాణి ఇలా ప్రజలకు బెదిరించడమేమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


