
కృష్ణా జిల్లా పులిగడ్డ వద్ద కారును ఢీకొన్న లారీ.. నలుగురు మృతి
మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు
మృతుల్లో మూడు నెలల బాబు
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన జిడుగు సందీప్ తన తల్లిదండ్రులు మోహన్బాబు(57), అరుణ(50), భార్య పల్లవి, కుమార్తె సాత్విక(5), కుమారుడు షణ్ముఖ(3 నెలలు)తో కలసి కారులో కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వారి కారును పులిగడ్డ–పెనుమూడి వంతెన టోల్ప్లాజా మధ్య ఎదురుగా పామాయిల్ లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్బాబు, అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మృతిచెందారు.
తీవ్రంగా గాయపడిన సాతి్వకను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మచిలీపట్నం తరలిస్తుండగా, మార్గంమధ్యలో మరణించింది. గాయపడిన పల్లవి, సందీప్లను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో చిన్నారి షణ్ముఖను ఊయలలో వేసేందుకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం చూపరులను కలచివేసింది.