వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల | A retired employee fell into honey trap in marturu | Sakshi
Sakshi News home page

వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల

Mar 23 2026 4:55 AM | Updated on Mar 23 2026 4:55 AM

A retired employee fell into honey trap in marturu

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.1.09 కోట్లు స్వాహా  

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమై ఎరవేసిన కిలాడీ  

మార్టూరు: వలపు వలకు ఓ విశ్రాంతి ఉద్యోగి చిక్కాడు. కిలాడీ మాయలో పడి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట రూ.1.09 కోట్లు పోగొట్టుకున్నాడు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి బాధితుడు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలోని పుసులూరు గ్రామానికి చెందిన పొన్నం వెంకటేశ్వర్లు, ఆయన భార్య ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. 

వెంకటేశ్వర్లు గతేడాది ఆగస్టులో పదవీవిరమణ చేశారు. కొన్ని నెలల నుంచి మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలోని బంధువులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల కిందట కందుకూరి మౌనిక పే­రుతో ఓ యువతి ఫేస్‌బుక్‌ ద్వారా వెంకటేశ్వర్లుతో పరిచయం పెంచుకొంది. తన సమీప బంధు­వు దాసరి నీరజ్‌ కుమార్‌ 15 ఏళ్లుగా ఆన్‌లైన్‌ ట్రే­డింగ్‌ చేస్తూ బాగా గడించాడని చెబుతూ అతన్ని సైతం వెంకటేశ్వర్లుకు పరిచయం చేసింది. 

చాటింగ్‌.. వీడియో కాల్స్‌తో సన్నిహితంగా.. 
అంతేకాక మౌనిక, వెంకటేశ్వర్లు వాట్సాప్‌ చాటింగ్, వీడియో కాల్స్‌ సైతం చేసుకుంటూ పరస్పరం సన్నిహితమయ్యారు. ఈ క్రమంలో మౌనిక, నీరజ్‌ కుమార్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్లో విశేష అనుభవశాలి అంటూ హర్ష అనే మరో యువకుడిని సైతం వెంకటేశ్వర్లుకు పరిచయం చేశారు. వెంకటేశ్వర్లు తమను నమ్మాడు అని గ్రహించిన మౌనిక బృందం తమ ప్లాన్‌ అమలు ప్రారంభించారు. 

వెంకటేశ్వర్లు చేత మొదటిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న రూ.10 వేలు ఆన్‌ లైన్‌ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టించి రూ.11,900 లాభం చూపించారు. రెండోసారి రూ.50 వేల పెట్టుబడికి రూ.20 వేల లాభాన్ని, మూడో సారి రూ.2 లక్షలు పెట్టించి రూ.40 వేల లాభాలు వచ్చాయని వెంకటేశ్వర్లు ఖాతాలో జమ చేశారు. ఆపై ముగ్గురూ కలిసి వెంకటేశ్వర్లును నమ్మించి అతని బ్యాంకు ఖాతాలో ఉన్న కోటి తొమ్మిది లక్షల రూపాయిలను ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరిట స్వాహా చేశారు. 

ఫోన్‌కు స్పందించకపోవడంతో... 
తాము అనుకున్న పనిపూర్తయ్యాక నిందితులు ముగ్గురూ బాధితుడు వెంకటేశ్వర్లుకు ఫోన్‌కు అందుబాటులో లేకపోవడంతో విషయం అర్థమైంది. ఈ మోసం గురించి వెంకటేశ్వర్లు మొదట బయటకు చెప్పుకోలేదు. జీవితకాలం సంపాదించిన సొమ్ము అంతా పోవడంతో తట్టుకోలేక ఆదివారం మార్టూరు పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement