రవాణా వాహనదారులకు ఊరట
పెనాల్టీ లేకుండా త్రైమాసిక పన్ను చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు
సాక్షి, అమరావతి: రవాణా వాహనదారులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రవాణా వాహనదారులు ప్రతి మూడు నెలలకోసారి చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను (క్వార్టర్లీ ట్యాక్స్)ను మార్చి 31లోగా కట్టవచ్చని గ్రేస్ పీరియడ్ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. సాధారణంగా త్రైమాసికం ఆరంభంలో క్వార్టర్లీ ట్యాక్స్ను రవాణా వాహనదారులు చెల్లించాలి.
జనవరి నెలాఖరులోగా వాహనదారులు క్వార్టర్లీ ట్యాక్స్ను ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే లారీ యజమానులకు ఉన్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల పాటు గడువిస్తూ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల లారీ యజమానుల సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు.. ప్రభుత్వానికి, రవాణా మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు తెలిపారు.