
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్ల పెంపు
గత ఆరేళ్లలో 62 శాతం మేర పెరుగుదల
ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ, జీఎఫ్టీఐల్లో 62,853
నిరుటితో పోలిస్తే కొత్తగా 2,916 సీట్లు అందుబాటులోకి
ఐదేళ్లలో కొత్త తరం ఐఐటీల్లో 6500 సీట్ల పెంపునకు కేంద్రం అనుమతి
జోసా కౌన్సెలింగ్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఈ నెల 9, 11న మాక్ టెస్టు సీట్ల కేటాయింపు జాబితా విడుదల
జూన్ 14 నుంచి జూలై 16 వరకు 6 విడతల్లో తుది సీట్లు భర్తీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సంస్థల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటితోపాటు 2025–26 విద్యా సంవత్సరానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో నడిచే గ్రాడ్యుయేట్ ఫీల్డ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్టీఐ)లలో 62,853 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కొత్త కోర్సులను పరిచయం చేస్తూ అవకాశాలను మరింత మెరుగుపరుస్తోంది. దీంతో గత ఏడాదితో పోలిస్తే 2916 సీట్లు పెరిగాయి.
జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీలు ట్రిపుల్ఐటీలు, జీఎఫ్టీఐ లకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ను విడుదల చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య గత సంవత్సరం కంటే 4.86 శాతం పెరుగుదలను ప్రతిబింబించింది. ఐఐటీల్లో నిరుడు 17,760 సీట్లు ఉండగా తాజాగా 400 పెరిగాయి. ఎన్ఐటీల్లో 296 కొత్త సీట్లను చేర్చారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో అత్యధికంగా 1,394 సీట్లు అందుబాటులోకి రావడం విశేషం.
జీఎఫ్టీఐలలో 826 సీట్లు పెరిగాయి. ఈ నెల 3 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు చేపట్టింది. 11 వరకు ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం రెండుసార్లు మాక్ సీట్ ప్రక్రియ నిర్వహిస్తారు. మాక్ సీట్ అలాట్మెంట్ ఆధారంగా ర్యాంకు ప్రకారం ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. మాక్ సీట్–1 కేటాయింపు జాబితాను జూన్ 9న, మాక్ సీట్–2 కేటాయింపు జాబితాను జూన్ 11న ప్రకటిస్తారు.
జోసా–2025లో భాగంగా అకడమిక్ ప్రోగ్రామ్స్ కోసం అభ్యర్థుల నమోదు, ఆప్షన్ల ప్రక్రియ జూన్ 12తో ముగుస్తుంది. ఈ ఏడాది కౌన్సెలింగ్లో 127 విద్యా సంస్థలు పాల్గొంటున్నాయి. జూన్ 14 నుంచి జూలై 16 వరకు ఆరు విడతల్లో సీట్లు కేటాయింపు జరుగనుంది.
62 శాతం సీట్లు పెరుగుదల
దేశంలో 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలతో పాటు 47 జీఎఫ్టీఐలు, ఇతర సంస్థలు జోసా కౌన్సెలింగ్లో పాల్గొంటున్నాయి. కొన్నేళ్లుగా ఐఐ టీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో సీట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 2019కి ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య కోసం విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చుచేసి చదువుకోవాల్సి వచ్చేది.
ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సాంకేతిక విద్యను మెరుగుపరిచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా ఏటా సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో 2019లో 38,704 సీట్లు ఉండగా.. ఇప్పుడు 62,853కు చేరాయి. అంటే ఆరేళ్లలో 24,149 సీట్లు (62 శాతం) పెరిగాయి. గతంలో డీపీ సింగ్ నివేదిక మేరకు 2024 నాటికి 50 శాతం సీట్ల పెంపు లక్ష్యాన్ని నెరవేర్చింది.
ఐఐటీల్లో మరింత..
ఐఐటీల్లో దశలవారీగా వచ్చే ఐదేళ్లలో మరో 6,500 సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం 18,160 సీట్లు ఉండగా.. అవి 24 వేలు కానున్నాయి. కొత్త తరం ఐఐటీలైన తిరుపతి, ధార్వాడ్, పాలక్కాడ్, జమ్ము, భిలాయ్లో ఏటా 200కు పైగా కొత్త యూజీ సీట్లను పెంచుకునేలా చర్యలు చేపట్టింది. ఇలా ఏడాదికి దాదాపు 1,500 సీట్లు పెరగనున్నాయి.
ఏపీ, తెలంగాణాల్లో 3,424
ఏపీ, తెలంగాణలో జోసా ద్వారా 3,424 సీట్లను భర్తీ చేయనుంది. నిరుడు 3,384 ఉండగా 40 సీట్లు పెరిగాయి. హైదరాబాద్ ఐఐటీలో 630, తిరుపతి ఐఐటీలో 254, వరంగల్ నిట్లో 1049, తాడేపల్లిగూడెం నిట్లో480, స్పా విజయవాడలో 132, హైద్రాబాద్ సెంట్రల్ వర్సిటీలో 110, శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీలో 438, కర్నూలు ట్రిపుల్ ఐటీలో 331 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్లో 35 సీట్లు పెరిగాయి. నిరుడు నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును 10 సీట్లతో అందుబాటులోకి తేగా ఇప్పుడు 35కి పెంచారు.

