సొమ్ము స్పాన్సర్లది సంబరం సర్కారుది | Rathasaptami celebrations successfully with the support of traders and industrialists | Sakshi
Sakshi News home page

సొమ్ము స్పాన్సర్లది సంబరం సర్కారుది

Feb 6 2025 7:24 AM | Updated on Feb 6 2025 7:24 AM

Rathasaptami celebrations successfully with the support of traders and industrialists

వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సహకారంతో విజయవంతంగా రథసప్తమి వేడుకలు 

స్పాన్సర్స్‌ కావాలని జేసీ నిర్వహించిన సమావేశంతో సత్ఫలితాలు 

ముందుకొచ్చిన జిల్లాలోని వివిధ రంగాల ప్రముఖులు  

ప్రభుత్వం పైసా ఇవ్వకపోయినా వివిధ వర్గాల సాయంతో  అట్టహాసంగా నిర్వహణ

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రథసప్తమి వేడుకలు ముగిశాయి. రాష్ట్ర పండగగా ప్రకటించిన ప్రభుత్వం పైసా విడుదల చేయకపోయినా స్పాన్సర్ల సహకారంతో విజయవంతమయ్యాయి. ఒక వైపు దేవస్థానానికి విరాళాలిచ్చిన దాతల డోనర్‌ పాసుల విషయంలోనూ, సంప్రదాయంగా దర్శనం కల్పించడంలోనూ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించినప్పటికీ జిల్లాలోని మిగతా వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సాయంతో పండగను సక్సెస్‌ చేసింది. 

నగరంలో జరిగిన అభివృద్ధి పనుల నుంచి విద్యుత్‌ కాంతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరత్రా అలరించే ప్రోగ్రామ్స్‌ వరకు దాతలే దిక్కయ్యారు. జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో స్పాన్సర్స్‌ కావాలని వివిధ వర్గాలతో నిర్వహించిన సమావేశం సత్ఫలితాలను ఇచ్చింది. అధికారుల మాట కాదంటే టార్గెట్‌ అయిపోతామేమోననో.. ఇబ్బందులొస్తాయనో, దేవుడు కార్యక్రమానికి అడిగినప్పుడు సాయం చేయడం మంచిదనో తెలియదు గానీ జిల్లా యంంత్రాంగం అడిగిన వెంటనే ప్రతీ ఒక్కరూ పోటీ పడి సాయం చేశారు. అయితే, ఆ సాయం ఎంతనేది అధికారులే లెక్క చెప్పాలి.   

No Headline
అంతా అధికారులే.. 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వేడుకల నిర్వహణ బాధ్యతను అధికారులే తీసుకున్నారు. కార్పొరేషన్, సుడా నిధులతో కొంతమేర అభివృద్ధి పనులు చేసినా అవి పూర్తయ్యేందుకు కూడా స్పాన్సర్లసాయం తీసుకున్నట్టు సమాచారం. ఇక, వేడుకలు విజయవంతంగా జరగడానికి సాంస్కృతిక, క్రీడా పోటీలు, విద్యుత్‌ కాంతులు, హెలికాప్టర్‌ రైడింగే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. హెలికాప్టర్‌ రైడింగ్‌ ఒక్కొక్కరికీ రూ.1800 టికెట్‌ పెట్టడంతో గతంలో ఎన్నడూ ఎక్కని వారంతా ఒక్కసారైనా పయనించాలని ఆరాట పడ్డారు. డబ్బులను లెక్క చేయకుండా రైడింగ్‌ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీల నిర్వహణ, బహుమతులు అందజేయడంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం ఉంది. అట్టహాసంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు జ్యూయలరీ, వస్త్ర, ఇతరత్రా బడా వ్యాపారులు ఆర్థికంగా సాయపడ్డారు. ఇక, లేజర్‌ షో, క్రాకర్స్, హాస్యనటుల ప్రోగ్రాం, సింగర్‌ మంగ్లీ ఈవెంట్‌ కూడా దాదాపు దాతల సహకారంతోనే జరిగినట్టు సమాచారం.  

సమన్వయంతో నిర్వహణ.. 
రాష్ట్ర, జిల్లా అధికారులు కూడా సమన్వయంతో వ్యవహరించారు. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం, విశాఖ కనకమహలక్ష్మీ దేవస్థానం, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, విజయనగరం పైడితల్లి అమ్మవారు, శంబర పోలమాంబ ఉత్సవాలతో పాటు అరకు ఉత్సవాలకు వినియోగించిన అనేక శకటాలను ఇక్కడికి తెప్పించి శోభాయాత్రను విజయవంతం చేశారు. ఇందులో దేవదాయ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి ముందుండి నడిపించగా.. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వై.భద్రాజీ తదితరులు తమవంతు శాయశక్తులా పనిచేశారు. ఒకవైపు ఆలయానికి విరాళాలు ఇచ్చిన దాతలపై చిన్న చూపు చూసినప్పటికీ,  ప్రభుత్వం పైసా విడుదల చేయకుండా చేతులు దులుపుకున్నా.. ఉత్సవాల నిర్వహణ భారాన్ని దాదాపు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలే మోశారు. ప్రభుత్వంతో పనిలేకుండా దాతల సహకారంతో ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతం చేయవచ్చనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement