ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు | Personal home loan disbursements down compared to last year | Sakshi
Sakshi News home page

ఇల్లు వద్దు.. అప్పు అసలే వద్దు

Mar 15 2025 4:19 AM | Updated on Mar 15 2025 4:19 AM

Personal home loan disbursements down compared to last year

గతేడాదితో పోలిస్తే తగ్గిపోయిన వ్యక్తిగత గృహ రుణాల విడుదల

2023–24 మార్చి–సెప్టెంబర్‌ కాలంలో రూ.16,033 కోట్ల రుణాలిచ్చిన బ్యాంకులు

2024–25లో అదే కాలానికి రూ.15,831 కోట్లకు పరిమితం

నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ తాజా నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ పాలనలో పురో­భివృద్ధిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు.. గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరోగమనంలో ఉన్నట్లు వ్యక్తిగత గృహ రుణాలు తేటతెల్లం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు, చర్యల కారణంగా వ్యక్తిగత గృహ రుణాలు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా గృహ రుణాల్లో 14 శాతం వృద్ధి నమోదైతే.. మన రాష్ట్రంలో మాత్రం క్షీణించినట్లు ఎన్‌హెచ్‌బీ 2024 నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల (ఏప్రిల్‌–­సెప్టెంబర్‌) కాలంలో వివిధ బ్యాంకులు విడుదల చేసిన వ్యక్తిగత గృహ రుణాల విలువ రూ. 15,831 కోట్లకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో బ్యాంకులు విడుదల చేసిన రుణాల మొత్తం రూ.16,033 కోట్లు. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రుణాల విలువ రూ.202కోట్లు తక్కువ. 

దేశవ్యాప్తంగా ఇప్పటి­వరకు మంజూరైన గృహ రుణాల విలువ అంత­కు­­ముందు ఏడాదితో పోలిస్తే 14శాతం పెరిగి రూ.33.53 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్‌ 2024 నాటికి రాష్ట్రంలో ఔట్‌స్టాండింగ్‌ రుణాల విలువ రూ.4,10,416 కోట్లుగా ఉన్నట్లు ఎన్‌హెచ్‌బీ నివేదికలో పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించాయనడానికి బ్యాంకుల రుణ మంజూరు తగ్గడం, జీఎస్టీ వసూళ్లు క్షీణించడం నిదర్శనమని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement