'సాక్షి'పై కూట‌మి స‌ర్కార్ అక్క‌సు.. జ‌ర్న‌లిస్టుల నిర‌స‌న‌ | Journalists protest against AP government | Sakshi
Sakshi News home page

'సాక్షి' ఎడిటర్ ఇంట్లో సోదాలు.. ఖండించిన జ‌ర్న‌లిస్టులు

May 8 2025 6:07 PM | Updated on May 9 2025 1:41 PM

 Journalists protest against AP government

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం, పోలీసుల తీరుపై పాత్రికేయులు, జ‌ర్న‌లిస్టు సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌తికా స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం మోపుతున్న చంద్ర‌బాబు స‌ర్కారు వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాయి. సాక్షి మీడియాపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌ర్న‌లిస్టులు  ఆందోళ‌నలు చేప‌ట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వ‌కుండా సాక్షి దిన‌ప‌త్రిక ఎడిట‌ర్ ధ‌నంజ‌య‌రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయ‌డాన్ని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. సాక్షి మీడియాపై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికాయి.

హైద‌రాబాద్  సాక్షి ప్ర‌ధాన కార్యాల‌యంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లో పాత్రికేయులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సాక్షి ఎడిటర్ ధ‌నంజ‌య‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లడాన్ని నిరసిస్తూ విశాఖ‌ప‌ట్నంలో జ‌ర్న‌లిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద నిరసన చేప‌ట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ నిన‌దించారు. 

త‌ర్వాత జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం స‌మ‌ర్పించారు. కూటమి ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. కృష్ణాజిల్లాలోనూ జ‌ర్న‌లిస్టులు ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధ‌నంజ‌య‌రెడ్డి ఇంట్లో పోలీసుల అక్రమ సోదాలను ఎన్టీఆర్ జిల్లా నందిగామ జర్నలిస్టులు ఖండించారు. ప్రభుత్వ , పోలీసుల తీరును నిరసిస్తూ నందిగామ ఆర్డీవోకు వినతిపత్రం స‌మ‌ర్పించారు. 

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధ‌ర్నా
కర్నూలు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ధర్నా చేప‌ట్టాయి. సాక్షి ఎడిటర్ ధ‌నంజ‌య‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకొవాలని డిమాండ్ చేశాయి. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడటం సరికాద‌ని సూచించాయి. కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి  జర్నలిస్టు సంఘాల నేత‌లు వినతిపత్రం అందజేశారు.

గాంధీ విగ్రహానికి వినతిపత్రం
సాక్షి ఎడిటర్ ధ‌నంజ‌య‌రెడ్డిపై పోలీసులు కక్ష్య సాధింపు చర్యలకు దిగడంపై తిరుపతి జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ క్లబ్ ఆధ్వ‌ర్యంలో నిరసన తెలిపాయి. ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలకు నిరసనగా గాంధీ విగ్రహానికి  వినతిపత్రం అందించాయి.

నల్ల రిబ్బన్లు ధరించి నిర‌స‌న‌
సాక్షి దిన‌ప‌త్రిక ఎడిటర్ ధ‌నంజ‌య‌రెడ్డిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చ‌ర్య‌ల‌ను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి  జర్నలిస్టులు నిరసన చేప‌ట్టారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిఆర్వో వెంకట్రావ్ కు వినతి పత్రం అందజేశారు. 

సంగారెడ్డి జిల్లాలో.. 
సాక్షి ఎడిటర్ ధ‌నంజ‌య‌రెడ్డి ఇంటికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు వెళ్లడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు నిరస‌న తెలిపారు. కలెక్టర్  వల్లూరి క్రాంతికి వినతి పత్రం సమర్పించారు.

పెద్దపల్లి జిల్లాలో.. 
సాక్షి ఎడిటర్ ధ‌నంజ‌య‌రెడ్డి ప‌ట్ల  ఏపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుకు నిరసనగా గోదావరిఖని బస్టాండ్ రాజీవ్ రహదారిపై సాక్షి దినపత్రిక, టీవీ ఛానల్ ప్రతినిధులు నల్ల బ్యాడ్జీలు ధ‌రించి రాస్తారోకో చేశారు. దీంతో రాజీవ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్ప‌డింది.

ఏపీలో పత్రిక స్వేచ్ఛ ఉందా?
సాక్షి ఎడిటర్ ధ‌నంజ‌య‌రెడ్డి నివాసంలో పోలీసుల సోదాలను  వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సాక్షాత్తు పత్రికా సంపాదకులను టార్గెట్ చేయడం శోచనీయమ‌ని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేన‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా అని ప్ర‌శ్నించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడ‌టానికి కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. 

చ‌ద‌వండి: పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్‌ కక్ష సాధింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement