నేడు, రేపు విస్తారంగా వానలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి తూర్పు–పడమర గాలుల కలయిక (షియర్ జోన్) కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.
వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.