
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): తాను వైఎస్సార్ కుటుంబానికి, వైఎస్సార్సీపీకి వీర విధేయుడినని, సీఎం జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు. ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడారు. సోమవారం తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు, చానళ్లు వక్రీకరించాయని చెప్పారు. తాను హింసావాదిని కాదని.. సౌమ్యవాదినని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన తన మాటలను వేరే రకంగా ప్రచారం చేశారని వాపోయారు. 2009లో వైఎస్ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ధర్మం పక్కన నిలబడటం కోసం.. వైఎస్ జగన్కు అండగా నిలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచానంటే రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గానికి వైఎస్ కుటుంబం చేసిన సేవలే కారణమన్నారు. వైఎస్ జగన్ దయ వల్లే ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు.
అలాంటి నేను మంత్రి పదవి ఇవ్వనందుకు హింసావాదిగా మారతానని ఎలా అంటానని ప్రశ్నించారు. మంత్రి పదవులిచ్చే విషయంలో సీఎం జగన్కు పూర్తి స్వేచ్ఛ ఉందని.. ఆయన నిర్ణయం శిరోధార్యమన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి చంటి మంగతాయారు, నాయకులు పి.ఈశ్వరరావు, గొర్ల బాబూరావు, శీరం నర్సింహమూర్తి, నూకినాయుడు, సాయి, వెంకటసూరి, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.