అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు 

Fire Accident At Visakhapatnam Quarantine Center - Sakshi

విశాఖ క్వారంటైన్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

10 నిమిషాల్లో 64 మంది రోగుల తరలింపు

కంప్యూటర్లు దగ్ధం.. రోగులంతా క్షేమం 

మధురవాడ(విశాఖ): విశాఖపట్నంలోని ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. మధురవాడ సమీపంలోని కొమ్మాది చైతన్య కళాశాల వాల్మీకి క్యాంపస్‌లో 170 గదులు ఉండగా 145 గదుల్లో క్వారంటైన్‌ సెంటర్‌ నడుపుతున్నారు. రెండో అంతస్తులో ఉన్న కంప్యూటర్‌ రూమ్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో మంటలు రేగాయి. దీంతో సుమారు 20 కంప్యూటర్‌లు దగ్ధమయ్యాయి.

మంటలను గమనించిన సిబ్బంది, అధికారులు అప్రమత్తమై.. పక్కనే ఉన్న మరో క్వారంటైన్‌ సెంటర్‌లోకి 64 మంది పాజిటివ్‌ రోగులను 10 నిమిషాల్లోనే తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ నార్త్‌ జోన్‌ ఏసీపీ రవిశంకరరెడ్డి, జేసీ గోవిందరాజు, విశాఖ రూరల్‌ మండల తహసీల్దార్‌ ఆర్‌.నరసింహమూర్తి కోవిడ్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ తదితరులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top