మీరు తింటున్న చికెన్‌ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు

Dangerous Chemicals In Food Items In Restaurants And Hotels - Sakshi

సాక్షిప్రతినిధి, కర్నూలు: మనం తింటున్న బిర్యానీలో మెటానియల్‌ ఎల్టో, టార్‌ట్రాజిన్‌ అనే రసాయనాలు కలుపుతున్నారు. దీంతో పాటు టేస్టింగ్‌సాల్ట్‌ (చైనాఉప్పు) తప్పనిసరి. వీటి వినియోగంతో బిర్యానీలో మంచి రుచి, రంగు వస్తోంది. కానీ వరుసగా 40 రోజులు తింటే కీళ్లనొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

రెస్టారెంట్లకు వెళ్లినా, డిన్నర్‌లకు వెళ్లినా ఐస్‌క్రీం తినడం తప్పనిసరి. చివరకు ఫ్యామిలీ ప్యాక్‌లను ఇళ్లలో ఫ్రిజ్‌లలో ఉంచి తింటున్నారు. వీటిలో కొవ్వుశాతం మరీ తక్కువగా ఉన్న పాలను వినియోగించడంతో పాటు టార్‌ట్రాజిన్, రంగులు కలుపుతారు. ఐస్‌క్రీం గడ్డకట్టేందుకు రసాయనాలు వినియోగిస్తారు. పిల్లలకు ఎంతో ప్రేమతో వీటిని తినిపిస్తుంటాం. ఇవి ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

దీర్ఘకాలం బేకరీలలో సిల్వర్‌ పూతతో ఉండే స్వీట్లు తింటే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.  సిల్వర్‌ పూతలో సీసం ఎక్కువగా ఉంటుంది. స్వీట్లలో వాడే సన్‌సెటన్, కాట్రాజ్, బ్రిలియంట్‌ ఎల్లో, టార్ఫిజిన్‌ కూడా హానికరమే.

ఆపిల్‌ ఎక్కువ కాలం నాణ్యంగా ఉండేందుకు కంటికి కనిపించని మైనపుపూత పూస్తారు. అలాగే పురుగుమందులు పిచికారీ చేస్తారు. శుభ్రం చేయకుండా తింటే వీటితో కూడా ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం

రోడ్డు సైడ్‌ తయారు చేసే పానీపూరి, గోబీతో పాటు అన్ని రకాల వంటల్లో టేస్టింగ్‌సాల్ట్, ఇతర రసాయనాలు కలుపుతున్నారు. రుచికోసం, మంచి రంగు కోసం, ఎక్కువ కాలం నిల్వ కోసం ఇలాంటి వాటిని వాడుతున్నారు. ఈ ఆహార పదార్థాలు తిన్న వారు ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు.

ఆహార పదార్థాల అమ్మకం, వినియోగం జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆహార భద్రతా వ్యవస్థ వైఫల్యంతో కల్తీలకు అడ్డుపడటం లేదు. ఉమ్మడి జిల్లాలో 2018–19లో ఫుడ్‌సేప్టీ’(ఆహార భద్రత) అధికారులు 374 శాంపిల్స్‌ సేకరించి, 54 నాణ్యతలేనివిగా తేల్చారు. అలాగే 36 శాంపిల్స్‌ ఆరోగ్యానికి తీవ్ర హానికరమైనవిగా తేల్చి కేసులు నమోదు చేశారు.

2020–21లో 175 శాంపిల్స్‌ సేకరిస్తే ఐదు నాణ్యత లేనివని, ఎనిమిది నకిలీవని, ఒకటి హానికరమని తేల్చారు. 2021–22లో 313 శాంపిల్స్‌ తీస్తే ఇందులో ఐదు నాణ్యత లేనివి, రెండు ప్రమాదకరమైనవి, నాలుగు నకిలీవి ఉన్నట్లు నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలో చిన్నా పెద్దా హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, చాట్, నుడుల్స్‌  షాపులు అన్ని కలుపుకుని ఆరు వేలకు పైగా ఉన్నాయి. కర్నూలు నగరంలోనే 1500 దాకా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది.

ఆహారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ లైసెన్స్‌ మంజూరు చేయాలి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న చిన్న, మధ్యతరగతి హోటళ్లలో 20 శాతానికి మించి అనుమతులు లేవు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫుడ్‌సేప్టీ అధికారుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో తనిఖీలు, కేసుల నమోదుకు ఇబ్బందిగా మారింది. కేసులు నమోదు చేస్తే చార్జ్‌షీటు నుంచి కోర్టు కేసుల వరకూ తిరిగేందుకు కూడా సిబ్బంది లేరు. దీంతో కేసుల నమోదుకు ఈ శాఖ కూడా ఆసక్తి చూపడటం లేదు. నిబంధనల మేరకు ఏడాదికి నిర్వహించాల్సిన మేరకు శాంపిల్స్‌ తీసి మ.మ. అనిపిస్తున్నారు.

రోజుల తరబడి నిల్వ.. 
ఫుడ్‌సేప్టీ అధికారులు పలు మండీల్లోని పండ్లు ల్యాబ్‌కు పంపారు. ఇందులో 13 శాంపిల్స్‌ ప్రమాదరకంగా తేల్చారు. ఇందులో ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, సపోటతో పాటు పలు రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు మాగేందుకు వాడే రసాయనాలతో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది. అలాగే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో పాటు పలు రకాల పదార్థాలు రోజుల తరబడి నిల్వ ఉంటాయి.

వాటికి కలర్‌కోటింగ్‌ ఇచ్చి రుచి కోసం రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. బేకరీల్లో  స్వీట్లు, కేక్‌లకు వాడే రంగులు, వాటిపై వాడే వెండిపూత అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని స్వీట్లు నోట్లో పెట్టుకోగానే వాసన వస్తుంది. కొన్ని రసాయనాలను ప్రభుత్వం నిషేధించినా రెండు జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. గాలి, వెలుతురు ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల, ముఖ్యంగా డాబాల్లో, బార్లలో చీకట్లో ఆహారాన్ని వడ్డిస్తున్నారు. దీంతో ఆహారం ఎలా ఉందో, అందులో ఏ రంగు కలిపారో తెలియని పరిస్థితి.

పురుగుమందుల కోటాలో టేస్టింగ్‌ సాల్ట్‌ దిగుమతి  
టేస్టింగ్‌సాల్ట్‌ చైనా నుంచి ఫరి్టలైజర్స్‌ పేరుమీద  దిగుమతి అవుతోంది. ఆహార విషెస్‌ సూచికలో ఇది లేదు. చైనాలో ఇది వంటల్లో వాడితే ఉరిశిక్ష విధించేలా అక్కడి శిక్షలు ఉన్నాయి. దీన్ని తరచుగా తింటే బీపీ, షుగర్‌ చిన్నవయస్సులోనే వచ్చే ప్రమాదముంది. తరచూ వాడితే మన నాలుక కొన్ని రుచులను గుర్తించే గుణాన్ని కోల్పోతుంది. పాస్ట్‌ఫుడ్, రెస్టారెంట్లలో టేస్టింగ్‌సాల్ట్‌ లేకుండా ఏ వంటకం తయారవడం లేదు.

ఆరోగ్యానికి హాని ఇలా.. 
మెటానియల్‌ ఎల్లో వాడకం నిషేధం. కానీ వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దు్రష్పభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతుంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. 
వంటకాల్లో రంగుకోసం వాడే నిషేధిత టార్‌ట్రాజిన్‌ చాలా ప్రమాదకరం. దీనితో థైరాయిడ్‌ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, తామర వచ్చే సూచనలు ఉన్నాయి.   
స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్‌ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాట్రాజ్, గ్రీన్‌ కలర్‌ కోసం వాడే బ్రిలియంట్‌ బ్లూ, టారా్టజిన్‌లు ప్రమాదకరం. 
చాక్లెట్లలో వాడే రోడ్‌మన్‌–బి కూడా ప్రాణాంతకమే.  
ఆహార కల్తీ వల్లనే 53 శాతం మందికి క్యాన్సర్‌  వస్తున్నట్లు పలు సంస్థల సర్వేల్లో తేలింది.

విదేశాల్లో చర్యలు ఇలా... 
కెనడా, ఐర్లాండ్, స్వీడన్‌ వంటి దేశాల్లో ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఆ దేశాలను అత్యుత్తమ ఆహార నాణ్యత కలిగిన దేశాలుగా పేర్కొన్నాయి. 
కెనడాలో విక్రయించే అన్ని ఆహారపదార్థాలను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిందే. వ్యవసాయం, ఇతర ఆహారపదార్థాల కోసం అక్కడ ప్రత్యేకశాఖలు, విభాగాలున్నాయి. 
వ్యవసాయ ఉత్పత్తులపై నిఘాకు, పునఃశుద్ధికి ‘వ్యవసాయ ఆహార కెనడా’ అనే సంస్థతో అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కెనడియన్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్షన్‌ ఏజెన్సీ(సీఎఫ్‌ఐఏ) ఆ«దీనంలో పనిచేస్తోంది. ఈ సంస్థ పౌరుడికి చేరే ప్రతి ఆహారపదార్థాన్ని తప్పకుండా పరిశీలించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి ఇస్తుంది. కోడిగుడ్లను సైతం పునఃశుద్ధి ప్రక్రియ చేయకుండా అనుమతి ఇవ్వదు. రుచికోసం రసాయనాలను ఏమాత్రం అనుమతించవద్దు. సహజ రుచుల్లోనే వండివడ్డించాలనేది అక్కడి నియమం. ఇలాంటి నిబంధనలను ఇక్కడ కూడా కఠినంగా అమలు చేస్తేనే కల్తీని అరికట్టవచ్చు.
చదవండి: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top