వైద్య వ్యవస్థలపై సైబర్‌ నేరగాళ్ల కన్ను | Cybercriminals eye medical systems | Sakshi
Sakshi News home page

వైద్య వ్యవస్థలపై సైబర్‌ నేరగాళ్ల కన్ను

Jan 29 2025 5:04 AM | Updated on Jan 29 2025 5:05 AM

Cybercriminals eye medical systems

తరువాతి స్థానాల్లో విద్య, రక్షణ రంగాలు.. అత్యధిక సైబర్‌ దాడులు భారత్‌పైనే

ప్రపంచ సగటు కంటే భారత్‌లో మూడు రెట్ల సైబర్‌ దాడులు

గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ నివేదిక–2025 వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక సైబర్‌ దాడులు భారత్‌పైనే జరుగుతుండగా.. అందులోనూ వైద్య వ్యవస్థలపైనే అత్యధికంగా సైబర్‌ దాడులకు నేరగాళ్లు తెగబడుతున్నారు. గ్లోబల్‌ సైబర్‌ సెక్యూరిటీ నివేదిక–2025 పేరిట ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసిన నివేదిక భారత్‌లో సైబర్‌ దాడుల తీవ్రతను వెల్లడించింది. 

నివేదిక ఏం చెప్పిందంటే..
2023తో పోలిస్తే 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులు 44శాతం పెరిగాయి. ప్రపంచంలోని కీలక మౌలిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సైబర్‌ దాడుల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని మౌలిక వ్యవస్థలపై సగటున వారానికి 1,847 సైబర్‌ దాడులు జరిగాయి. భారత్‌లో మాత్రం అంతకు మూడు రెట్లు సైబర్‌ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మౌలిక వ్యవస్థలు సగటున వారానికి 3,291 సైబర్‌ దాడుల బారిన పడటం గమనార్హం. 

రెండో స్థానంలో విద్యారంగం
భారత్‌లో వైద్య రంగమే అత్యధికంగా సైబర్‌ దాడుల బారినపడింది. సైబర్‌ నేరగాళ్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలపై సగటున వారానికి 8,614 సైబర్‌ దాడులకు తెగబడ్డారు. సగటున వారానికి 7,983 సైబర్‌ దాడులతో విద్యారంగం రెండో స్థానంలోనూ, 4,731 దాడులతో రక్షణ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. 

2024 మే నెలలో భారత్‌ అత్యధికంగా సైబర్‌ దాడుల బారిన పడింది. ఆ ఒక్క నెలలోనే వేలిముద్రలు, ఫేషియల్‌ స్కాన్లతోసహా ఏకంగా 500 జీబీ బయోమెట్రిక్‌ డేటా చౌర్యానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సహా దేశంలోని ప్రముఖ వైద్యసంస్థలు సైబర్‌ దాడులతో హడలెత్తిపోయాయి. వైద్య సంస్థల్లోని రోగుల వ్యక్తిగత వివరాలను సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టారు.

జెన్‌ ఏఐని వినియోగించి..
జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (జెన్‌ ఏఐ) ద్వారా సైబర్‌ నేరగాళ్లు యథేచ్చగా సైబర్‌ దాడులకు తెగబడుతున్నారు. జెన్‌ ఏఐ ద్వారా దుష్ప్రచారం, డీప్‌ ఫేక్‌ వీడియోలు సృష్టించి సైబర్‌ దాడులకు పాల్పడటంతోపాటు బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొట్టడం, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు యత్నించారు. ప్రధానంగా రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్ల ద్వారా ఫేక్‌ అప్‌డేట్లతోనే ఈ సైబర్‌ దాడులకు పాల్పడుతున్నారు. మొత్తం సైబర్‌ దాడుల్లో 58 శాతం ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడినవే కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement