బాబు సర్కారుకు బలుసు ఇం‘ధనం’! | Creating fake subcontracts and collecting money for work not done | Sakshi
Sakshi News home page

బాబు సర్కారుకు బలుసు ఇం‘ధనం’!

Apr 11 2026 3:10 AM | Updated on Apr 11 2026 3:10 AM

Creating fake subcontracts and collecting money for work not done

అమరావతిలో నీకింత.. నాకింత!

ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్‌’

ఫేక్‌ సబ్‌ కాంట్రాక్టులు సృష్టించి.. చేయని పనులకు డబ్బులు వసూలు 

అవే డబ్బులు.. ఎన్నికల ముందు టీడీపీ పెద్దలకు సరఫరా

ప్రతిఫలంగా అమరావతిలో భారీగా పనులు అప్పగింత.. ఇప్పటికే రూ.7,440.08 కోట్ల విలువైన 19 ప్యాకేజీలు బీఎస్సార్‌ పరం

మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద రూ.744 కోట్లు ఇచ్చేసి.. 8 శాతం కమీషన్‌లు వసూలు!

బీఎస్సార్‌కు గతంలో దక్కిన పనులను రద్దు చేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన చంద్రబాబు సర్కార్‌

తాజాగా నిర్వహించిన టెండర్లలో అదే సంస్థకు పనులు పందేరం

ఇది గూడుపుఠాణీ కాక మరేమిటంటున్న ఇంజనీరింగ్‌ నిపుణులు, పరిశీలకులు

సాక్షి, అమరావతి: ఫేక్‌ సబ్‌ కాంట్రాక్టులు సృష్టించి.. చేయని పనులకు డబ్బులు వసూలు చేసుకుని.. దాన్ని టీడీపీ పెద్దలకు ఎన్నికల ఇం‘ధనం’ కింద సమకూర్చినందుకు ప్రతిఫలంగా అస్మదీయ కాంట్రాక్టర్లకు రాజధానిలో పనులు కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకుంటున్నారని ఇంజనీరింగ్‌ నిపు­ణులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్పష్టంచేస్తున్నారు. ఆ ఫేక్‌ కాంట్రాక్టులు ఎవరివి? ఎంత విత్‌డ్రా చేశారు? అనే సమగ్ర సమాచారం వివరాలు తీగ లాగితే డొంక కదలడం ఖాయమని వ్యాఖ్యా­నిస్తున్నారు. 

రాజధాని అమరావతిని అవినీతి గనిగా మార్చేశారని, దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో దోచేయడానికి అక్షయపాత్రగా చేసుకున్నారని పేర్కొంటున్నారు. సీఎం చంద్ర­బాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీని­వాసరావుకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సంస్థకు ఇప్పటికే రూ.7,440.08 కోట్ల విలువైన 19 ప్యాకేజీల పనులు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం దీనికి నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. కర్ణాటకలో బెంగళూరు, మైసూర్‌ లాంటి ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు 2014, 2024 ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున ఇం‘ధనం’ చేకూర్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఇందుకు ప్రతిఫలంగా క్విడ్‌ ప్రోకో కింద అమరావతిలో అధిక ధరలకు పెద్ద ఎత్తున పనులు అప్పగించి, మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద రూ.744 కోట్లు ఇచ్చేసి.. అందులో 8 శాతం కమీషన్లు వసూలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. నిబంధనలు తుంగలో తొక్కేసి రాజధానిలో రూ.1,082.44 కోట్ల విలువైన 220 కేవీ విద్యుత్తు లైన్‌ పనులను 8.98 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన బీఎస్సార్‌ సంస్థకు అప్పగించడం ఈ దోపిడీకి మరో నిదర్శనమని ఉదహరిస్తున్నారు.

నాడు రూ.211.53 కోట్లే... నేడు రూ.470.41 కోట్లు 
బంగ్లాల నిర్మాణం పేరుతో బరి తెగింపు..
రాజధాని అమరావతి ప్రాంతంలో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒకొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనులను 2017–18లో రూ.211.54 కోట్లకు టెండర్లలో బీఎస్సార్‌కు చంద్రబాబు సర్కార్‌ కట్టబెట్టింది. 

2019 నాటికి రూ.35.18 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు 2023లో కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ఇచ్చిన నివేదికలో తేల్చింది. అంటే మిగిలిన పని విలువ రూ.176.36 కోట్లు మాత్రమే. కానీ.. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ పని అంచనా వ్యయాన్ని రూ.401.37 కోట్లకు పెంచేసి గతేడాది టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రూ.419.07 కోట్లకు కోట్‌ చేసి మళ్లీ బీఎస్సార్‌ సంస్థే ఆ పనులను దక్కించుకోవడం గమనార్హం. స్టీలు, సిమెంటు సహా నిర్మాణ సామగ్రి ధరల్లో నాటికీ నేటికీ పెద్దగా వ్యత్యాసం లేదు. 

పైగా ఇసుక ఉచితం. అయినా సరే రూ.176.36 కోట్ల విలువైన పనిని ఏకంగా రూ.419.07 కోట్లకు బీఎస్సార్‌ సంస్థకు కట్టబెట్టడం గమనార్హం. ఇది గూడుపుఠాణి కాక మరేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక సీనరేజీ, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో రూ.76.59 కోట్లు రీయింబర్స్‌ చేస్తామని సీఆర్‌డీఏ పేర్కొంది. అంటే.. ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.495.66 కోట్లు. 2019కి ముందు ఇదే పనులకు రూ.35.18 కోట్లు వ్యయం చేశారు. అంటే.. ఈ బంగ్లాల నిర్మాణ విలువ రూ.530.84 కోట్లు.

చదరపు అడుగుకు రూ.11,203.41.. మెట్రో నగరాలకు మించి వ్యయం..
మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న 71 బంగ్లాలలో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్‌లో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే టెండర్లలో నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. 

మౌలిక సదుపాయాలతో కలిపి సగటున చదరపు అడుగుకు రూ.11,203.41 చొప్పున వ్యయం చేస్తుండటం గమనార్హం. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.7.47 కోట్లు. ఇదే తరహా బంగ్లా ధర బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో భూమితో కలిపి రూ.5 కోట్ల లోపే ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు.

ఒకే ప్యాకేజీని రెండుగా విభజించి.. అంచనా వ్యయం రూ.123.28 కోట్లు పెంపు
అనంతవరం, నెక్కళ్లు, తుళ్లూరు, నేలపాడు, శాఖమూరు గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్‌ పనులను జోన్‌–2 కింద 2017 ఆగస్టు 7న టెండర్లలో రూ.725.71 కోట్లకు బీఎస్సార్‌ సంస్థకు నాటి చంద్రబాబు సర్కార్‌ అప్పగించింది. అనంతరం 2024లో చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లను రద్దు చేసింది. 

అప్పట్లో ఒకే ప్యాకేజీ కింద జోన్‌–2 లేఅవుట్‌ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ.. గతేడాది వాటిని రెండుగా విభజించి జోన్‌–2ఏ (అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్‌), జోన్‌–2బీ (అనంతవరం, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు ల్యాండ్‌ పూలింగ్‌ లే అవుట్‌) టెండర్లు పిలిచింది. జోన్‌–2ఏ పనులను రూ.416.62 కోట్లు, జోన్‌–2బీ పనులను రూ.432.37 కోట్లకు కోట్‌ చేసిన బీఎస్సార్‌ సంస్థకే మళ్లీ అప్పగించడం గమనార్హం. అంటే.. అప్పటికీ ఇప్పటికీ అంచనా వ్యయం రూ.123.28 కోట్లు పెంచేసి బీఎస్సార్‌కే కట్టబెట్టడం వెనుక మర్మమేటన్నది బహిరంగ రహస్యమే.

నిబంధనలు తుంగలో తొక్కి.. ఇష్టారాజ్యంగా విద్యుత్తు పనులు..
టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్‌ 20న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. దాని ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధికంగా కాంట్రాక్టర్లు కోట్‌ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్‌ పిలవాలి. కానీ.. చంద్రబాబు సర్కార్‌ ఆ నిబంధనలను తుంగలో తొక్కింది. 

రాజధాని ప్రాంతంలో ఎన్‌–10 రహదారి నుంచి ఎన్‌–13–ఈ–11 రహదారుల జంక్షన్‌ వరకు 220 కేవీ ఎక్స్‌ట్రా హైవోల్టేజీ(ఈహెచ్‌వీ) అండర్‌ గ్రౌండ్‌ లైన్‌ ఏర్పాటుకు సంబంధించి మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి ఒక ప్యాకేజీ కింద సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఈ టెండర్‌లో 8.98 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌కు రూ.1,082.44 కోట్లకు పనులు కట్టబెట్టింది. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఖజానాకు దాదాపు రూ.90 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మేరకు బీఎస్సార్‌కు లబ్ధి చేకూరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement