రేపల్లెకు చెందిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావును వైఎస్సార్సీపీలోకి ఆహ్వనిస్తున్న వైఎస్ జగన్. చిత్రంలో పార్టీ నేత నాగమోహన కృష్ణ తదితరులు
అనుచరులతో సహా పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాసరావు
పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ సీఎం వైఎస్ జగన్
పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటానని జగన్ వెల్లడి
తనపై నమ్మకంతో తన వెంట నడిచే ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని స్పష్టీకరణ
పార్టీ నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం
సాక్షి, అమరావతి : ‘ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్ఏడీఏ–అప్సడా)కి తెలీకుండా, దాని అంగీకారం లేకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి?’ అంటూ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం చంద్రబాబును నిలదీశారు. ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? అని ప్రశ్నించారు.
కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు మౌనంగా ఉన్నారంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు.. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ వైఎస్ జగన్ గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఆ పోస్టులో ఏమన్నారంటే..
కమీషన్ల కోసం లాలూచీ కాదా?..
‘‘చంద్రబాబుగారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటినీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండే అప్సడాకు తెలీకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులు పెట్టడానికి? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీ వాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్ కంపెనీలు మీ పార్టీ సానుభూతిపరులవేనన్నది అక్షర సత్యం కాదా? కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు.
చంద్రబాబు గారూ.. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులు కూడా చితికిపోయారు. సిండికేట్ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకొచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి చైర్మన్గా అప్సడా అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటుచేస్తే మీరు వచ్చాక ఉద్దేశపూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్, ఫీడ్ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గర నుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, యూనిట్ కరెంటును కేవలం రూ.1.5తో వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యంచేసి ఆ రైతులను రోడ్డున పడేశారు.

మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప, వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడ్ రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా? చంద్రబాబు గారూ.. ఆక్వా ఫీడ్ రేట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలి కన్నీళ్లు కార్చడం కాదు. పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపజేయాలి. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం’’.


