గొట్టిపడియ గ్రామాన్ని ఖాళీచేసి వెళ్తున్న నిర్వాసితులు , చివరిసారిగా గ్రామంలోని ఆలయంలో పూజలు చేస్తున్న గొట్టిపడియ గ్రామస్తులు
ఆదివారం సాయంత్రానికీ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లో జమకాని పరిహారం
నేడు నీరు విడుదలైతే పరిస్థితి ఏమిటని నిర్వాసితుల్లో ఆందోళన
రూ.250 కోట్లకు పైగా బకాయిలు
18 ఏళ్లు నిండిన వారికి రూ.2 లక్షల హామీ ఏమైంది?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలోనూ ఇంకా పలువురు నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం నగదు జమకాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పరిహారం ఇస్తారంటూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. గొట్టిపడియ, సుంకేశుల, గుండంచెర్ల, తదితర ముంపు గ్రామాల్లో అవార్డు పొందిన వారికి కూడా పరిహారం అందలేదు.
అలాగే, 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం రావాల్సి ఉంది. ముంపు గ్రామాల ప్రజలను స్వగ్రామాల నుంచి ఖాళీ చేయించే ప్రక్రియ వేగవంతమైనప్పటికీ, అందుకు అనుగుణంగా పరిహారం చెల్లింపులు పూర్తికాకపోవడం నిర్వాసితుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఇప్పటికే అనేక కుటుంబాలు తమ ఇళ్లు, ఆస్తులు, పశువులు, జీవనోపాధిని వదిలి పునరావాస కేంద్రాలు, పట్టణాలు, ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. అయితే, పరిహారం మాత్రం అందరికీ పూర్తిస్థాయిలో అందకపోవడంతో వారి భవిష్యత్తుపై అయోమయం నెలకొంది.
రూ.250 కోట్లకు పైగా బకాయిలు..
ముంపు గ్రామాల నిర్వాసితులకు చెల్లించాల్సిన వివిధ రకాల పరిహారం, పునరావాస ప్యాకేజీల కింద సుమారు రూ.250 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియ ముందుకు సాగుతున్నా.. పరిహారం చెల్లింపుల్లో మాత్రం ఆ వేగం కనిపించడంలేదని నిర్వాసితులు వాపోతున్నారు. తమ చేతిలో ఉన్న ఇల్లు, భూమి పోతున్న సమయంలో పరిహారం అందకపోతే కొత్త జీవితం ఎలా ప్రారంభించాలని ప్రశి్నస్తున్నారు. అలాగే, ముంపు గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఇచ్చిన హామీపై కూడా నిర్వాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామాలు ఖాళీ అవుతున్న వేళ కనీసం ఈ మొత్తమైనా వెంటనే ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ముంపునకు గురైతే పరిహారం పరిస్థితి ఏంటి?
ఇక ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసే సమయం దగ్గర పడుతుండటంతో నిర్వాసితుల్లో టెన్షన్ మరింత పెరిగింది. నీరు చేరిన తర్వాత ఇళ్లు, భూములు ముంపునకు గురైతే తమ పరిహారం పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ముందుగా పరిహారం చెల్లించి, ఆ తర్వాతే గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయని నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు.
‘ఊరు వదిలాం.. ఇళ్లు వదిలాం.. జీవనాధారం వదిలాం.. ఇప్పుడు పరిహారం కోసం కూడా ఎదురు చూడాలా?’ అని నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన హామీలను తక్షణమే అమలుచేసి, పెండింగ్లో ఉన్న పరిహారాన్ని పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 18 ఏళ్లు నిండిన వారికి ప్రకటించిన రూ.2 లక్షల సాయాన్ని కూడా జమచేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.
ప్యాకేజీ రాకపోతే ఇక్కడే నా చావు..
మాది వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన గొట్టిపడియ. నా భర్తకు గతంలో యాక్సిడెంట్ కావడంతో మానసిక పరిస్థితి సరిగ్గాలేదు. మాకు రావాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చాం. అయినా ఇప్పటివరకు మా ఖాతాలో ప్యాకేజీ నగదు జమకాలేదు. ఇప్పుడు ఇల్లు ఖాళీచేసి బయటకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఇంట్లోని సామాన్లు బయటకు తీసుకొచ్చినా వాటిని పెట్టుకునేందుకు కనీసం అద్దె ఇల్లు తీసుకునే స్థోమత కూడా నాకు లేదు. ప్యాకేజీ రాకపోతే ఇక్కడే నా చావు తథ్యం. – ఇరుగుల శ్రీలక్ష్మి, గొట్టిపడియ
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి..
మాది గొట్టిపడియ గ్రామం. నాకు నలుగురు ఆడపిల్లలు. ఇప్పటివరకు మాకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందలేదు. ప్రాజెక్టు కోసం మా ఊరు, ఇల్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో మా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మా నలుగురు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వెంటనే అందించి ఆదుకోవాలి. – భూతపాటి రాణి, గొట్టిపడియ
పంట చేతికొచ్చే వేళ ఖాళీ చేయాలంటే ఎలా!?..
వెలిగొండ ప్రాజెక్టు కింద నా పదెకరాల పొలంలో పత్తి పంట సాగుచేశా. ఇప్పటివరకు రూ.6 లక్షలు ఖర్చుచేశాను. అయితే, పొలాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందని మాకెలాంటి సమాచారంగానీ, నోటీసుగానీ ఇవ్వలేదు. పంట చేతికొచ్చే సమయంలో పొలాన్ని ఖాళీ చేయాలంటే పెట్టుబడి మొత్తం నష్టపోతాం. పంట కోతకు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలి.. లేదా నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి పరిహారం ఇవ్వాలి. – రొక్కం శ్రీనివాసరెడ్డి, గొట్టిపడియ


